G. Kishan Reddy: దమ్ముందా? అని ఆనాడు అడిగావ్ కదా రేవంత్ రెడ్డీ... ఆ దమ్ము చూపే అవకాశం ఇప్పుడు నీకే వచ్చింది: కిషన్ రెడ్డి

  • ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాఫ్తును కోరగలరా? అని ప్రశ్న
  • కేజ్రీవాల్ అరెస్ట్‌ను కాంగ్రెస్ వాళ్లు ఖండిస్తున్నారని... కుంభకోణాల పార్టీ ఇలా చేయడంలో ఆశ్చర్యం లేదని ఎద్దేవా
  • మాటలతో పూట గడిపే ప్రయత్నమని మండిపాటు
Kishan Reddy demand Revanth Reddy over kaleswaram project

రేవంత్ రెడ్డీ... కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ దర్యాఫ్తు కోరే దమ్ముందా? అని నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగావ్ కదా... ఇప్పుడు అమిత్ షా, కేంద్రం అవసరం లేదు... ఆ దమ్ము చూపే అవకాశం నీకే వచ్చింది... ఇప్పుడు మీరే సీబీఐ దర్యాఫ్తుని అడగాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాఫ్తును కోరగలరా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే వాటిని కోల్డ్ స్టోరేజీలో పెట్టవద్దని... వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటపై నిలబడాలన్నారు.

కేజ్రీవాల్ అరెస్ట్‌ను కాంగ్రెస్ వాళ్లు ఖండిస్తున్నారని... కానీ కుంభకోణాల పార్టీ ఇలా చేయడంలో ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని... కుంభకోణాలను వేరు చేసి చూడలేమన్నారు. కేసీఆర్ అవినీతిపై 100 రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారని.. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనను సవాల్ చేశారని గుర్తు చేశారు.

'కిషన్ రెడ్డి నీకు దమ్ముందా? అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇప్పించు.. కాళేశ్వరంపై నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయ్.. సీబీఐ దర్యాఫ్తు చేస్తే బీఆర్ఎస్ అక్రమాలు నిరూపిస్తాను.. లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటాను' అని నాడు రేవంత్ రెడ్డి సవాల్ చేశారని... ఇప్పుడు అధికారం ఆయన చేతిలోనే ఉందని గుర్తు చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మేడిగడ్డ ప్రాజెక్టుపై ఏం చేశారు? అని ప్రశ్నించారు. కళ్లముందే ఇంత అవినీతి కనిపిస్తుంటే కాంగ్రెస్ ఏం చేస్తోంది? అని నిలదీశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాఫ్తు కోరుతూ గతంలో కాంగ్రెస్... కేంద్రానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. అప్పుడే కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ దర్యాఫ్తుకు అవకాశం లేదని వెంటనే కాంగ్రెస్‌కు లేఖ ద్వారా చెప్పిందని తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినందున కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాఫ్తు చేసేందుకు అంగీకరించాలని సూచించారు. కాంగ్రెస్ కోరితే కేంద్రం 24 గంటల్లో మేడిగడ్డపై దర్యాఫ్తును ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు. 

వంద రోజులు పూర్తయ్యాక కాంగ్రెస్ పాలన చూస్తుంటే మాటలతో పూటగడిపే ప్రయత్నమే కనిపిస్తోందని ఆరోపించారు. గ్యారెంటీలపై, బీఆర్ఎస్ అవినీతిపై మాటలతో కాలం గడిపేస్తోందని విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు సంబంధించి బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గతంలో అవినీతి ఆరోపణలు గుప్పించిందని గుర్తు చేశారు. ఇప్పుడు వారు చేసిన సెటిల్మెంట్‌లను బయటకు తీసి వీరు మళ్లీ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. కంపెనీలను, బిల్డర్లను, రియల్ ఎస్టేట్ కంపెనీలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌పై దర్యాఫ్తుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వారికి ఇచ్చారు కదా... ఇప్పుడు మాకూ ఇవ్వండి అని వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ మనుషులు ఆర్జీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే అన్నారు. కుక్క తోక వంకర అన్నట్లు కాంగ్రెస్ మారదని... ఆ పార్టీ చరిత్రే అవినీతి అనీ అన్నారు.

More Telugu News