Rajababu: రాజబాబు ఆ మాట అనేవాడు .. అలాగే జరిగింది: తమ్ముడు చిట్టిబాబు

  • రాజబాబుది జాలిగుండె అని చెప్పిన చిట్టిబాబు 
  • ఎంతోమందిని చదివించాడని వెల్లడి 
  • మరెంతో మందికి పెళ్లిళ్లు జరిపించాడని వ్యాఖ్య 
  • ఎంజీఆర్ సైతం అభినందించారని వివరణ

Chittibabu Interview

రాజబాబు .. తెలుగు తెరపై ఇప్పటికే చెరిగిపోని ఒక నవ్వుల సంతకం. అలాంటి రాజబాబును గురించి, ట్రీ మీడియావారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిట్టిబాబు మాట్లాడారు. " రాజబాబుకి ముందు మా ఫ్యామిలీ నుంచి ఎవరూ సినిమాల్లోకి వెళ్లలేదు. సినిమాలకి సంబంధించి మాకు ఎవరితోనూ ఎలాంటి పరిచయాలు ఉండేవి కాదు. అన్నయ్య తన టాలెంటుతో ఒక్కో మెట్టూ ఎదుగుతూ వెళ్లాడు. మా కుటుంబం నుంచి తరతరాలు చెప్పుకునే కీర్తిని సంపాదించాడు" అని అన్నారు. 

"రాజబాబుకి మొదటి నుంచి కూడా జాలిగుణం ఎక్కువ. తాను చదువుకోలేక పోయినందువలన, 67 మంది విద్యార్థులను సొంత ఖర్చుతో డిగ్రీ చదివించాడు. కోరుకొండలో జూనియర్ కాలేజ్ కట్టించాడు. మా చెల్లి పెళ్లి చేయాలనుకున్నప్పుడు డబ్బులేక మేము చాలా ఇబ్బందులు పడ్డాము. అందువలన 70 - 80 పెళ్లిళ్లను తన సొంతఖర్చుతో  జరిపించాడు. ప్రతి రోజు పాండీబజార్ కి వెళ్లి, సినిమాల్లో అవకాశాలు లేనివారికి భోజనాలు పెట్టించేవాడు" అని చెప్పారు. 

" మద్రాసులో వరదలు వచ్చినప్పుడు, ఆ ప్రాంతం వారికి 15 రోజుల పాటు భోజనం .. బట్టలకు ఇబ్బంది లేకుండా చూశాడు. తన తరువాత ఆ స్థాయిలో దానధర్మాలు చేసేది రాజబాబేనని ఎంజీఆర్ స్వయంగా చెప్పారు. కాకిలా కలకాలం బ్రతకడం కంటే, హంసలా 6 మాసాలు బ్రతికినా చాలని తరచూ అంటూ ఉండేవాడు. అలాగే 47 ఏళ్లకే చనిపోయాడు. సినిమా మూడు అక్షరాలు ఉన్నంతవరకూ రాజబాబు బ్రతికే ఉంటాడు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

More Telugu News