RCB: ఆఖర్లో చిచ్చరపిడుగుల్లా ఆడిన డీకే, అనుజ్ రావత్... బెంగళూరు భారీ స్కోరు

  • నేడు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్... సీఎస్కే × ఆర్సీబీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు
  • ఓ దశలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
  • ఆఖరి 5 ఓవర్లలో 71 పరుగులు సాధించిన దినేశ్ కార్తీక్, రావత్
Dinesh Kartik and Anuj Rawat guides RCB for huge total

ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. 

ఓ దశలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు భారీ స్కోరు చేసిందంటే అందుకు కారణం.. దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్. వీరిద్దరూ ఆఖరి ఓవర్లలో చిచ్చరపిడుగుల్లా చెలరేగడంతో చెన్నై బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. డీకే, అనుజ్ రావత్ భారీ షాట్లతో విరుచుకుపడడంతో ఆర్సీబీ చివరి 5 ఓవర్లలో ఏకంగా 71 పరుగులు రాబట్టింది.

అనుజ్ రావత్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 48 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. దినేశ్ కార్తీక్ 26 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి స్కోరులో 3 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. 

అంతకుముందు, బెంగళూరు ఇన్నింగ్స్ ప్రారంభంలో విరాట్ కోహ్లీ (21), ఫాఫ్ డుప్లెసిస్ (35) జోడీ మంచి పునాదే వేసింది. కానీ, ముస్తాఫిజూర్ రెహ్మాన్ అద్భుతమైన బౌలింగ్ తో ఆర్సీబీ టాపార్డర్ ను దెబ్బతీశాడు. ముస్తాఫిజూర్ ధాటికి కోహ్లీ, డుప్లెసిస్, రజత్ పాటిదార్ (0), కామెరాన్ గ్రీన్ (18) పెవిలియన్ చేరారు. 

మరో ఎండ్ లో విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ (0) ను దీపక్ చహర్ డకౌట్ చేశాడు. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ 4, దీపక్ చహర్ 1 వికెట్ తీశారు.

More Telugu News