Congress: ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ మరో కుట్రకు తెరలేపారు: ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్

  • బీజేపీ బాండ్లు, ఫండ్ల పేరిట పలువురిని ఇబ్బందిపెడుతూ వేలకోట్లు దండుకుందని ఆగ్రహం
  • కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని ఆరోపణ
  • ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బీజేపీ పెద్ద స్కామ్ చేసిందని విమర్శ
Mahesh Kumar Goud blames PM Narendra Modi

పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మరో కుట్రకు తెరలేపారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ బాండ్లు, ఫండ్ల పేరిట పలువురిని ఇబ్బందిపెడుతూ వేలకోట్లు దండుకుందన్నారు. కాంగ్రెస్‌కి చెందిన 4 బ్యాంకులలో 11 అకౌంట్లని ఎందుకు సీజ్ చేసిందని ప్రశ్నించారు. 210 కోట్ల డొనేషన్లలో రూ.14 లక్షల క్యాష్ లావాదేవీలు జరిపిందనే చిన్న కారణంతో అకౌంట్లను కేంద్రం ఎలా సీజ్ చేసిందో చెప్పాలన్నారు.

లోక్ సభ ఎన్నికలకు ముందు అకౌంట్లను సీజ్ చేసి ఖాతాలో ఉన్న డబ్బులను వాడుకోకుండా ఆంక్షలు విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆదాయపు పన్ను కట్టిన చరిత్ర లేదన్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బీజేపీ పెద్ద స్కామ్ చేసిందని ఆరోపించారు. కేంద్రాన్ని ఈ విషయంలో ఈసీ, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయలేదా? అని నిలదీశారు. 50 శాతానికి పైగా ఎలక్టోరల్ బాండ్ల డబ్బును బీజేపీ ఖాతాలోకి మళ్లించారన్నారు.

మేఘా కంపెనీ రూ.170 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను బీజేపీకి ఇచ్చిందన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో కమలం పార్టీ డొనేషన్లు 10 రెట్లు ఎలా పెరిగాయి? అని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని బీజేపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందన్నారు. మతం, దేవుళ్లు, అక్షింతల పేరిట మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చిందన్నారు. పేదలకు అన్యాయం చేసే బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

More Telugu News