Apple: యాపిల్‌కు భారీ నష్టాలు.. అమెరికా ప్రభుత్వం కేసుతో ఉక్కిరిబిక్కిరి

  • మార్కెట్‌పై గుత్తాధిపత్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న యాపిల్
  • యాంటీ ట్రస్ట్ చట్టాలు ఉల్లంఘించినందుకు అమెరికా న్యాయశాఖ కేసు
  • గురువారం యాపిల్ షేర్ విలువ ఢమాల్, 
  • సంస్థ మార్కెట్ విలువలో 113 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయిన వైనం
Apple Loses 113 Billion In Market Value As Regulators Close In

స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఏకఛత్రాధిపత్యంతో అపారలాభాలు గడిస్తున్న యాపిల్‌పై వివిధ దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. మార్కెట్‌లో పొటీ అనేదే లేకుండా గుత్తాధిపత్యం కొనసాగిస్తున్నందుకు యాపిల్‌పై యాంటీ ట్రస్ట్ చట్టాల ఉల్లంఘన కింద అమెరికా న్యాయశాఖ కేసు దాఖలు చేసింది. ఇప్పటికే ఐరోపా దేశాల్లో ఇలాంటి కేసులు ఎదుర్కొంటున్న యాపిల్‌కు సొంత దేశంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. యాపిల్ మదుపర్లలో టెన్షన్ పెరుగుతుండటంతో కంపెనీ షేరు ధర భారీగా తగ్గింది. గురువారం షేరు ధర 4.1 శాతం మేర పతనం కావడంతో కంపెనీ మార్కెట్ విలువలో 113 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయాయి. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు నష్టాలు 11 శాతానికి చేరుకున్నాయి. ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా పేరు పడ్డ యాపిల్ తాజాగా నాస్‌డాక్, ఎస్ అండ్ పీ సూచీల్లో నిరాశాజనకంగా కనిపించింది. 

తాజాగా అమెరికా న్యాయశాఖ యాపిల్‌పై సంచలన ఆరోపణలు చేసింది. మార్కెట్‌పై గుత్తాధిపత్యంలో కస్టమర్ల నుంచి డబ్బులు దండుకుంటోందని ఆరోపించింది. ‘‘ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగనిస్తే మార్కెట్‌పై యాపిల్ పట్టు మరింత బిగుసుకుంటుంది. కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకు కస్టమర్లు అధిక ధరలు చెల్లించే పరిస్థితి రాకూడదు’’ అని న్యాయశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తన గుత్తాధిపత్యం ఆధారంగా యాపిల్ కస్టమర్లు, డెవలపర్లు, కంటెంట్ క్రియేటర్లు, ఆర్టిస్టులు, పబ్లిషర్లు, చిన్న వ్యాపారుల నుంచి అధిక మొత్తం వసూలు చేస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. 

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, యాప్ స్టోర్ ద్వారా యాపిల్ అద్భుత లాభాలు గడిస్తోంది. డెవలపర్ల నుంచి యాప్ స్టోర్  30 శాతం వరకూ కమిషన్ వసూలు చేస్తుంది.

More Telugu News