Supreme Court: తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు సీరియస్... అతనిని మంత్రిగా నియమించేందుకు ఒకరోజు సమయం

  • అక్రమాస్తుల కేసులో డీఎంకే నేత పొన్ముడిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు
  • ఆ తర్వాత అతని జైలుశిక్షకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు
  • దీంతో పొన్ముడిని తిరిగి మంత్రిగా నియమించాలని భావించిన స్టాలిన్ ప్రభుత్వం
  • గవర్నర్ అడ్డుకోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం

డీఎంకే నేత పొన్ముడిని తిరిగి మంత్రిగా నియమించేందుకు గవర్నర్ అంగీకరించకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ గవర్నరే రాజ్యాంగాన్ని అనుసరించకపోతే ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది? అని సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. పొన్ముడిని తిరిగి మంత్రిగా నియమించేందుకు గవర్నర్‌కు ఒకరోజు గడువును ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ జెబి పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పు చెప్పింది.

అక్రమాస్తుల కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును లేవనెత్తుతూ పొన్ముడిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించారు. తదనంతర పరిణామాలతో పొన్ముడికి విధించిన జైలుశిక్షకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో పొన్ముడిని మళ్లీ మంత్రిగా నియమించాలని స్టాలిన్ ప్రభుత్వం భావించింది. కానీ ఈ ప్రయత్నాలను గవర్నర్ అడ్డుకున్నారు. పొన్ముడిని మంత్రిగా పునర్నియమించేందుకు గవర్నర్ తిరస్కరించడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ చర్య రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు.

More Telugu News