Ruturaj Gaikwad: చెన్నై సూపర్ కింగ్స్ కు కొత్త కెప్టెన్ వచ్చాడు!

  • ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ను టాప్ టీమ్ గా నిలబెట్టిన ధోనీ
  • ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నై సారథిగా రుతురాజ్ గైక్వాడ్
  • ఐపీఎల్ ట్రోఫీ అధికారిక ఫొటోషూట్ కు హాజరైన గైక్వాడ్
  • చెన్నై కొత్త కెప్టెన్ ఇతడేనంటూ పరిచయం చేసిన ఐపీఎల్ నిర్వాహకులు
Ruturaj Gaikwad as new captain for Chennai Super Kings in IPL 2024

ఐపీఎల్ 17వ సీజన్ కు తెరలేస్తోంది. రేపు (మార్చి 22) ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢీకొంటున్నాయి. సీఎస్కే అంటే ధోనీ, ధోనీ అంటే సీఎస్కే అన్నంతగా ఐపీఎల్ లో ఈ రెండు పేర్లు ఒకదానితో ఒకటి మమేకం అయ్యాయి. 

ధోనీ తర్వాత చెన్నై సారథి ఎవరన్న ప్రశ్నకు ఐపీఎల్ నిర్వాహకులు నేడు తమ ట్వీట్ తో సమాధానమిచ్చారు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ ఎవరో కాదు... ఇడుగో ఇతడే అంటూ నూతన కెప్టెన్ గా డైనమిక్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ను పరిచయం చేశారు. ఐపీఎల్ ట్రోఫీతో ఆయా ఫ్రాంచైజీల కెప్టెన్లతో ఫొటో షూట్ నిర్వహించగా, సీఎస్కే తరఫున రుతురాజ్ గైక్వాడ్ హాజరయ్యాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఐపీఎల్ నిర్వాహకుల ట్వీట్ ను బలపరిచింది. ధోనీ తన కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడని ఓ ట్వీట్ ద్వారా నిర్ధారించింది.

ఇటీవల ధోనీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును ఓసారి పరిశీలిస్తే... ఈసారి తాను కొత్త పాత్రను పోషిస్తున్నానని తెలిపాడు. ఈ నేపథ్యంలో, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా... ధోనీ వికెట్ కీపర్ గా జట్టులో ఉంటూనే, అటు మెంటార్ గా కానీ, కోచ్ గా కానీ కొనసాగే అవకాశాలున్నాయని అర్థమవుతోంది.

More Telugu News