DV Sadananda Gowda: లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు బీజేపీకి షాక్‌.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న‌ మాజీ సీఏం

  • రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన‌ బీజేపీ నేత డీవీ సదానంద గౌడ 
  • బెంగళూరు నార్త్‌ సీటు టికెట్ ఆశించిన ఆయ‌న‌కు భంగ‌పాటు
  • నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఆకాంక్షించిన మాజీ ముఖ్య‌మంత్రి
  • కాంగ్రెస్‌లో మాత్రం చేర‌న‌న్న బీజేపీ నేత‌
 Former Karnataka chief minister and BJP leader DV Sadananda Gowda quits Politics

లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు అధికార బీజేపీకి గ‌ట్టి షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్య‌మంత్రి బీజేపీ నేత డీవీ సదానంద గౌడ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బెంగళూరు నార్త్‌ సీటు టికెట్ ఆశించిన ఆయ‌న‌కు అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోవడంతో సదానంద గౌడ‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన స్థానంలో మ‌రొకరికి టికెట్ కేటాయించ‌డం తనను తీవ్ర‌ అసంతృప్తికి గురి చేసింద‌న్నారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు సదానంద గౌడ.

"కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చిన మాట వాస్తవమే. అయితే, తాను ఎట్టిప‌రిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేర‌ను. బీజేపీ ప్రక్షాళన దిశగా నా ప్రయాణం సాగుతుంది. టికెట్‌ ఇవ్వనందకు బాధగా ఉన్న మాట వాస్తవమే. నన్ను అవమానించిన వారు తర్వాత పశ్చాత్తాపపడతారు. నేను నిస్సహాయుడిని కాను. రాష్ట్ర బీజేపీ కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండాలి. పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించడం సరికాదు. రాష్ట్రంలో నియంతృత్వ ధోరణి ఉండ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నా" అని సదానంద గౌడ చెప్పుకొచ్చారు.

మరోవైపు కర్ణాటక నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తమ పేరు లేకపోవడంపై పలువురు బీజేపీ అగ్రనేతలు సైతం అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను పార్టీ విడుదల చేయగా అందులో సదానంద గౌడ, కేఎస్ ఈశ్వరప్ప, కరాడి సంగన్న వంటి అగ్రనేతల పేర్లు లేకపోవడం గమనార్హం.

More Telugu News