APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై హైకోర్టు స్టే

  • 2018లో గ్రూప్-1 నియామకం చేపట్టిన హైకోర్టు
  • అక్రమాలు జరిగాయంటూ పిటిషన్లు
  • నియామకం రద్దు చేస్తూ మార్చి 13న హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు
  • హైకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ
  • ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట కల్పించిన విస్తృత ధర్మాసనం
High Court stays on single bench verdict over APPSC Group1 Mains

ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. మెయిన్స్ రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని పేర్కొంది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. 

నేడు విచారణ చేపట్టిన విస్తృత ధర్మాసనం తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే విధించింది. నాటి గ్రూప్-1 నియామకాల్లో ఉద్యోగాలు పొందినవారు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథ స్థితిలో ఉండొచ్చని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 27కి వాయిదా వేసింది. 

2018లో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ లో మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నడూ లేని విధంగా మెయిన్స్ పరీక్ష పత్రాలను మూడు సార్లు మూల్యాంకనం చేశారని ఆరోపించారు. డిజిటల్ మూల్యాంకనం చేశారని, ఇది నోటిఫికేషన్ కు విరుద్ధమని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

కోర్టు ఆదేశాలతో రెండు సార్లు మాన్యువల్ గా మూల్యాంకనం చేశారని, ఈ క్రమంలోనే అక్రమాలు జరిగాయని విన్నవించారు. మంగళగిరి హాయ్ లాండ్ లో మూల్యాంకనం చేసినట్టు పిటిషనర్లు ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో... 2018 నాటి గ్రూప్-1 నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 13న తీర్పు వెలువరించింది.

More Telugu News