Bode Prasad: కొడాలి నాని, వల్లభనేని వంశీలతో నాకు సంబంధాలు లేవు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు: బోడె ప్రసాద్

  • టీడీపీ ఆఫీస్, పట్టాభిపై దాడులు చేస్తున్నారనే విషయాన్ని ముందే చెప్పానన్న బోడె
  • అన్నం తినేవాడు ఎవరైనా వైసీపీలో చేరతారా? అని గతంలో వంశీ చెప్పారని వెల్లడి
  • టీడీపీ టికెట్ తనకే వస్తుందని ఆశాభాశం
I dont have contacts with Kodali Nani and Vallabhaneni Vamsi

తమ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పని చేయడమే తనకు తెలుసని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. పని చేయడం చేతకాని వాళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని... ఈ విషయాన్ని తన పిల్లల మీద ప్రమాణం చేసి చెపుతున్నానని అన్నారు. 

టీడీపీ కార్యాలయంపై, పట్టాభిపై దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని తాను ముందే చెప్పానని... కొడాలి నాని, వల్లభనేని వంశీలతో తనకు సత్సంబంధాలు ఉంటే తాను ఎందుకు చెపుతానని ప్రశ్నించారు. నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ ఆరోపణలు చేసినప్పుడు తాను ఆయనకు మెసేజ్ చేశానని... సర్వస్వం కోల్పోయావని చెప్పానని అన్నారు. 

ఎన్నికల్లో పోటీ చేయడం కోసం తనపై తప్పుడు ప్రచారాలు చేయాలా? అని ప్రశ్నించారు. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని బట్టే తాను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. తనకు టికెట్ వస్తుందని నమ్ముతున్నానని తెలిపారు. బాధతో తాను ఏదైనా మాట్లాడి ఉంటే అధిష్ఠానానికి క్షమాపణ చెపుతున్నానని అన్నారు. తన కంటే మంచి అభ్యర్థి దొరుకుతారేమోనని పార్టీ సర్వే చేయిస్తోందని భావిస్తున్నానని చెప్పారు. అన్నం తినేవాడు ఎవరైనా వైసీపీలో చేరతారా? అని గతంలో వల్లభనేని వంశీ చెప్పారని తెలిపారు.

More Telugu News