SS Rajamouli: జపాన్‌లో రాజ‌మౌళి.. భూకంపంపై కార్తికేయ ట్వీట్ వైర‌ల్‌

  • జపాన్‌లో రాజ‌మౌళి, కుమారుడు కార్తికేయ‌, నిర్మాత శోభు యార్లగ‌డ్డ 
  • ఆర్ఆర్ఆర్ స్పెషల్ షోల కోసం జపాన్‌కు
  • తాము బ‌స చేసిన‌ హోట‌ల్ వ‌ద్ద భూకంపం వ‌చ్చిన‌ట్లు కార్తికేయ ట్వీట్
Rajamouli son Karthikeya live through earthquake on 28th floor in Japan

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి త‌న కుమారుడు కార్తికేయ‌తో క‌లిసి జ‌పాన్‌లో ఉన్నారు. వీరితో పాటు నిర్మాత శోభు యార్లగ‌డ్డ కూడా ఉన్నాడు. 2022లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ 'ఆర్ఆర్ఆర్' స్పెషల్ షోల కోసం వారు జపాన్ వెళ్లారు. అయితే, జ‌పాన్‌లో తాము బ‌స చేసిన‌ హోట‌ల్ వ‌ద్ద భూకంపం వ‌చ్చిన‌ట్లు ఎస్ఎస్ కార్తికేయ తాజాగా ట్వీట్ చేశాడు. 

"జపాన్‌లో ఇప్పుడే భ‌యంక‌ర‌మైన భూకంపం వ‌చ్చింది. మేము 28వ అంత‌స్తులో ఉన్నాం. భూమి కంపించ‌డం ప్రారంభించింది. భూకంపం అని గ్ర‌హించి భ‌యాందోళ‌న‌కు గుర‌య్యా. కానీ, చుట్టుప‌క్క‌ల ఉన్న జ‌ప‌నీయులు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. నేను భూకంప అనుభూతి పొందా" అని పేర్కొన్నాడు. అలాగే ఈ ట్వీట్‌కు భూకంపం స‌మ‌యంలో త‌న స్మార్ట్ వాచ్‌లో వ‌చ్చిన వార్నింగ్‌ని ఫొటో తీసి కార్తికేయ షేర్ చేశాడు. దీనిపై అభిమానులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. వారు క్షేమంగా తిరిగి రావాల‌ని కోరుకుంటున్నారు. 

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం ప‌లు అంత‌ర్జాతీయ అవార్డుల‌ను సైతం సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది. 95వ అకాడమీ అవార్డుల్లో మూవీలోని నాటునాటు పాట‌కు బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ పుర‌స్కారం ద‌క్కింది. ఇదిలాఉంటే.. రాజ‌మౌళి త‌న త‌దుప‌రి సినిమాను ప్రిన్స్ మ‌హేశ్ బాబుతో చేయ‌నున్నారు. అడ్వెంచర్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుంద‌ని ర‌చ‌యిత విజయేంద్ర ప్రసాద్ వెల్ల‌డించారు.

More Telugu News