Nara Bhuvaneswari: రాష్ట్రం పరువు తీసిన వారిని ఇంటికి సాగనంపాలి: కార్యకర్తలకు భువనేశ్వరి పిలుపు

  • రాయచోటి నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన
  • హాజరైన నారా భువనేశ్వరి
  • టీడీపీ కార్యకర్తలతో సమావేశం
  • రాయలసీమ పౌరుషం చూపించాలని పిలుపు
Nara Bhuvaneswari held meeting with TDP cadre in Rayachoti

రాష్ట్రంలో తిష్టవేసిన అవినీతిపరులను రాయలసీమ ప్రజలు పౌరుషంగా అడ్డుకోవాలని... వారి చేతిలో నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాయచోటి నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా కార్యకర్తలతో భువనేశ్వరి మాట్లాడారు. 

చంద్రబాబు పాలనలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా పేరుపొందిన ఏపీ నేడు అప్పుల ఆంధ్రప్రదేశ్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టిందని విమర్శించారు. గతంలో ఏపీలో ఉన్న పరిశ్రమలన్నీ ప్రక్కనున్న రాష్ట్రాలకు తరలివెళ్లిపోయాయని, యువతకు ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని భువనేశ్వరి పేర్కొన్నారు. 

"టీడీపీ పాలనలో ఏపీకి పెట్టుబడులు వస్తే... నేడు ఆ కంపెనీలు ఏపీని వదిలి పారిపోతున్నాయి. రాష్ట్ర సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి ఆ అప్పులను మన నెత్తిమీద వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను గత ఐదేళ్లుగా అనేక ఇబ్బందులకు గురిచేశారు. దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రాయలసీమ కార్యకర్తలు పౌరుషంగా బయటకు రావాలి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నడుం బిగించాలి. ఎవరు ఎదురొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొని పోరాడాలి... తెలుగుదేశం జెండాను ఎగరేయాలి. 

చంద్రబాబు ఏం చేస్తారో అవే చెబుతారు. 2024లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, రైతులకు సంవత్సరానికి రూ.20 వేల పెట్టుబడి సాయం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు నెలకు రూ.1,500, చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15 వేలు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు. 

మహిళలు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో అలుపెరుగని పోరాటం చేశారు. పోలీసులు ఇబ్బందులు పెట్టినా ఎక్కడా వెనకడుగు వేయకుండా మా కుటుంబానికి అండగా నిలిచారు. ప్రతి ఒక్కరికీ మేం రుణపడి ఉంటాం. వచ్చే ఎన్నికల్లో మహిళలు కూడా తమ వంతు తెలుగుదేశంపార్టీ విజయానికి కృషి చేయాలి" అని భువనేశ్వరి అన్నారు.

More Telugu News