BJP: తమిళనాడులోనూ బీజేపీ పొత్తు ఖరారు... పీఎంకే పార్టీకి 10 సీట్లు

  • దక్షిణాది రాష్ట్రాల్లో కలిసి వచ్చే పార్టీలతో చేయి కలుపుతున్న బీజేపీ
  • ఇటీవల ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు
  • తాజాగా తమిళనాడులో పీఎంకేతో పొత్తు ఖరారు
  • మోదీ మూడోసారి పీఎం కావడం ఖాయమన్న అన్బుమణి రాందాస్
BJP and PMK alliance finalised in Tamilnadu

ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ... ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇదే తరహా పొత్తు రాజకీయాలకు తెరలేపింది. తమిళనాడులో పీఎంకే (పట్టాలి మక్కళ్ కట్చి) పార్టీతో బీజేపీ పొత్తు ఖరారైంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పీఎంకే పార్టీకి 10 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. 

తమిళనాడులో మొత్తం 39 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈసారి 400 లోక్ సభ స్థానాలు గెలవడం లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ... అందుకు ప్రాంతీయ పార్టీల మద్దతు ఎంతో అవసరమని భావిస్తోంది. 

తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బీజేపీ-పీఎంకే పార్టీ పొత్తు ఓ కొలిక్కి వచ్చింది. పొత్తు కుదిరిన నేపథ్యంలో, సేలంలో ప్రధాని మోదీ హాజరయ్యే సభలో పీఎంకే పార్టీ అగ్రనాయకత్వం కూడా హాజరుకానుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నామని, కాషాయదళంతో కలిసి లోక్ సభ ఎన్నికలకు వెళతామని పీఎంకే నిన్ననే ప్రకటించింది.

ఇవాళ పొత్తు ఖరారైన నేపథ్యంలో, పీఎంకే అధినేత అన్బుమణి రాందాస్ మాట్లాడుతూ, దేశ ప్రజల ప్రయోజనాల కోసం, సుపరిపాలన అందించేందుకు ప్రధానిగా మోదీ కొనసాగాల్సిన అవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఎన్డీయేతో చేయి కలపాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. తమిళనాడు ప్రజల స్థితిగతుల్లో మార్పునకు ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నామని తెలిపారు.

తమ కూటమి తమిళనాడులోనే కాకుండా యావత్ భారతదేశంలో ఘనవిజయం సాధిస్తుందని రాందాస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మూడోసారి పీఠం అధిష్ఠించడం తథ్యమని అన్నారు. పీఎంకే 2014లోనూ ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా వ్యవహరించింది.

అటు, తమిళనాడు అధికారపక్షం డీఎంకే పార్టీ కాంగ్రెస్ తో జట్టుకట్టి లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతోంది. కాంగ్రెస్ పార్టీకి డీఎంకే నాయకత్వం 9 సీట్లు కేటాయించింది.

More Telugu News