BRS: రేవంత్ రెడ్డికి మెజారిటీ ఉంది... మేం ప్రభుత్వాన్ని కూల్చమని స్పష్టంగా చెప్పాం: బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్

  • మేం ప్రభుత్వాన్ని పడగొడతామని వారికి వారే ఊహించుకుంటున్నారని వ్యాఖ్య
  • దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరన్న వినోద్ కుమార్
  • అనర్హతపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచన
Vinod Kumar says revanth reddy have full majority

సీఎం రేవంత్ రెడ్డికి మెజారిటీ ఉంది... మేం ప్రభుత్వాన్ని కూల్చమని స్పష్టంగా చెబుతున్నామని కరీంనగర్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరన్నారు. దానం నాగేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. నిన్న ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ... దానం అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఫిరాయింపులను ప్రోత్సహించవద్దని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఉద్యమకారులేనని వ్యాఖ్యానించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తాము కూల్చమని స్పష్టంగా చెప్పినప్పటికీ... వారికి వారే ఊహించుకుంటున్నారని విమర్శించారు. ఓ పార్టీ నుంచి గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లవద్దని... అలాచేసిన వారిని ఉరితీయాలని గతంలో ఇదే రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. 'రేవంత్ రెడ్డి గారు, మీకు మంచిగానే ఉంది మెజార్టీ. అయిదేళ్లు పరిపాలన చేయండి. మీరు చూసుకోవాల్సింది ఏమంటే మీ పార్టీలో ఉన్నవాళ్లు వెళ్ళకుండా చూసుకోండి' అని సూచించారు. ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం లేకపోయేసరికి ప్రజలు ఎంతో బాధపడుతున్నారని.. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వెళ్లడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం బీఆర్ఎస్ చేసింది కాబట్టి మేం కూడా చేస్తామంటే ఎలా? అని నిలదీశారు.

తాజాగా ప్రతిమ మల్టీప్లెక్స్‌లో డబ్బులు దొరికిన ఘటనపై వినోద్ కుమార్ స్పందించారు. అక్కడ దొరికిన డబ్బులకు వాళ్లే లెక్కలు చెప్పుకుంటారని స్పష్టం చేశారు. వారు తనకు బంధువులు అయినంత మాత్రాన తనపై నిరాధార ఆరోపణలు చేస్తారా? అని నిలదీశారు.

More Telugu News