Parvo virus: నిజామాబాద్ లో కుక్కలకు పార్వో వైరస్.. మనుషులకూ సోకే ముప్పు

  • గ్రామాల్లో పదుల సంఖ్యలో వైరస్ బారిన పడ్డ కుక్కలు
  • పుండ్లు, చీముతో వీధుల్లో తిరుగుతున్న వైనం
  • భయభ్రాంతులకు గురవుతున్న జనం
  • ఛత్తీస్ గఢ్ లోనూ వ్యాపిస్తున్న వైరస్
parvo virus in dogs in Nizamabad District

నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో వీధి శునకాలకు కొత్త వైరస్ సోకింది. గ్రామాల్లోని పదుల సంఖ్యలో కుక్కలు దీనిబారిన పడ్డాయి. పార్వో వైరస్ గా వ్యవహరించే ఈ వ్యాధి కారణంగా కుక్కల్లో బొబ్బలు వచ్చి, చీము, రక్తం కారతాయి. వైరస్ బారిన పడ్డ కుక్కలు యథేచ్ఛగా వీధుల్లో తిరుగుతుండడంతో మనుషులకూ వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు వీధుల్లో ఆడుకునే సమయంలో కుక్కలు దాడి చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. వైరస్ కారణంగా వీధి శునకాలకు చీము, రక్తం కారుతుండడం, వాటిపై వాలిన ఈగలు ఇళ్లల్లోని ఆహార పదార్థాలపై వాలితే ముప్పు తప్పదని అంటున్నారు.

అధికారులు స్పందించి వెంటనే ఆ కుక్కలను తరలించాలని కోరుతున్నారు. పల్తితండాలో పార్వో వైరస్ బారిన పడ్డ కుక్కల బెడద ఎక్కువగా ఉందని తండా వాసులు చెబుతున్నారు. తండాలో దాదాపు డెబ్బై కుక్కల వరకు ఉన్నాయని, వాటిలో సగానికి పైగా కుక్కలు వైరస్ బారిన పడ్డాయని తెలిపారు. వాటి వల్ల మనుషులకూ వైరస్ అంటుకుంటుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో వీధి కుక్కలకు పార్వో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. పలు జిల్లాలోని పశువైద్యశాలల్లో ప్రతిరోజూ 4 నుంచి 5 కేసులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు.

More Telugu News