Narendra Modi: బొప్పూడి సభ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీ

  • చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి వద్ద ప్రజాగళం సభ
  • నాలుగు హెలికాప్టర్లలో గన్నవరం నుంచి బొప్పూడి తరలి వచ్చిన ప్రధాని మోదీ
  • సభా వేదికపైకి చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
PM Modi arrives Boppudi

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాగళం సభలో పాల్గొనేందుకు బొప్పూడి చేరుకున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నాలుగు హెలికాప్టర్ల కాన్వాయ్ తో మోదీ బొప్పూడికి తరలి వచ్చారు.

నాలుగు హెలికాప్టర్లు దిగడంతో, మోదీ ఏ హెలికాప్టర్ లో ఉన్నారన్నది ఆసక్తి కలిగించింది. మోదీ రాకను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వాయుసేన హెలికాప్టర్ నుంచి దిగిన ప్రధాని మోదీకి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా స్వాగతం పలికారు. ఇక, హెలిప్యాడ్ నుంచి టయోటా ఫార్చ్యూనర్ వాహనంలో మోదీ సభా ప్రాంగణం వద్దకు బయల్దేరారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రజాగళం సభ ప్రధాన వేదిక పైకి చేరుకున్నారు. వారి రాకతో సభకు విచ్చేసిన టీడీపీ, జనసేన కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు, పవన్ సభకు వచ్చినవారికి చేయి ఊపుతూ, నమస్కారం పెడుతూ అభివాదం చేశారు.

చివరిగా ప్రధాని మోదీ వేదికపైకి చేరుకోవడంతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. నినాదాలతో ప్రజాగళం సభ మార్మోగిపోయింది. మోదీని... చంద్రబాబు, పవన్, పురందేశ్వరి సత్కరించారు. 

More Telugu News