Revanth Reddy: కేసీఆర్ నాటిన కలుపు మొక్కలు ఇంకా వాసన వెదజల్లుతున్నాయి... అన్నింటినీ పీకేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

  • తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తి
  • మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి
  • డిసెంబరు 3... తెలంగాణకు విముక్తి కలిగిన రోజు అని వెల్లడి
  • ప్రపంచం అబ్బురపడేలా ప్రజలు తీర్పు ఇచ్చారని స్పష్టీకరణ 
CM Revanth Reddy slams KCR on Congress govt 100th day event

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీట్ ద ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 2023 డిసెంబరు 3వ తేదీకి ఓ ప్రత్యేకత ఉందని అన్నారు. తెలంగాణకు విముక్తి కలిగిన రోజు అని అభివర్ణించారు. ప్రపంచం అబ్బురపడేలా ప్రజల తీర్పు వచ్చిందని వెల్లడించారు. 

కేసీఆర్ ది నిజాం నవాబుల వంటి పాలన అని, సంక్షేమ పథకాలు అమలు చేసినా స్వేచ్ఛను హరిస్తే ప్రజలు ఊరుకోరన్న విషయం స్పష్టమైందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాడు నిజాం కూడా సంక్షేమ పథకాలు అమలు చేశాడని, కానీ నిజాం ఎంత చేసినా సరే, తమకు స్వేచ్ఛ లేకుండా చేశాడని ప్రజలు తిరగబడ్డారని వివరించారు. 

కేసీఆర్ కూడా అదే విధంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూశారని, తన వారసులను సీఎంను చేయాలని చూశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. దాంతో కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు అధికారం నుంచి దింపారని వ్యాఖ్యానించారు. నిజాం తరహాలోనే కేసీఆర్ కూడా రాచరికాన్ని తీసుకురావాలని చూశారని, కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని అన్నారు. ప్రజాస్వామ్యంపై కేసీఆర్ కు నమ్మకం లేదని, ప్రజల స్వేచ్ఛకు ఏనాడూ విలువ ఇవ్వలేదని ఆరోపించారు. 

ఇక, తమ పాలన ప్రజల అభీష్టం మేరకే సాగుతుందని, ప్రజాభిప్రాయాలకు విలువనిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ధర్నాలు ఎందుకు? ధర్నా చౌక్ వద్దు అన్న వారికి అక్కడ ధర్నా చేసేందుకు అనుమతి ఇచ్చామని అన్నారు. నియంతలు ఎప్పుడూ సంస్కృతిని ధ్వంసం చేయాలని చూస్తారని వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా టీఎస్ ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇంటి పేరు తన్నీరు అయినంత మాత్రాన పన్నీరు కాలేరని చురక అంటించారు. కేసీఆర్ నాటిన కలుపు మొక్కలు ఇంకా కొన్ని ఉన్నాయని ఎత్తిపొడిచారు. కలుపు మొక్కలు అన్నింటినీ పీకి పారేస్తామని చెప్పారు. ఇలాంటి కలుపు మొక్కలను పీకిపారేయడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తానని స్పష్టం చేశారు. 

విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిన్న మాకు నోటీసులిచ్చింది... ముందుగా డబ్బు కట్టాకే జీరో విద్యుత్ బిల్లు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది అని రేవంత్ రెడ్డి వివరించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు ఈ ఆదేశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇలాంటి తెలివితేటలు మానుకోవాలని హితవు పలికారు. 

కేసీఆర్ ఆనవాళ్లు ఇంకా కొన్ని కనిపిస్తూనే ఉన్నాయని, కేసీఆర్ గంజాయి మొక్కలు ఇంకా వాసనలు వెదజల్లుతున్నాయని అన్నారు. అందుకే ఆ గంజాయి మొక్కలను పీకే పనిలో ఉన్నా... ఇప్పటికే కొన్ని గంజాయి మొక్కలు పీకాను... పీకాల్సిన గంజాయి మొక్కలు కొన్ని ఉన్నాయి... గంజాయి మొక్క అనేదే లేకుండా చేస్తా అని హెచ్చరించారు. తన్నీరు కూడా ఆ కుర్చీలో ఎక్కువ రోజులు ఉండరని స్పష్టం చేశారు.

More Telugu News