K Kavitha: రానున్న 10 రోజుల్లో కవితకు సమన్లు ఇవ్వం అని మాత్రమే సెప్టెంబర్ 15న చెప్పాం: కోర్టులో ఈడీ లాయర్

  • విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేశామని వెల్లడి
  • ఒక ఆర్డర్ తనకు అనుకూలంగా ఉన్నంత మాత్రాన నిరవధిక కాలానికి వర్తింప చేసుకోకూడదన్న ఈడీ
  • తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్న ఈడీ తరఫు లాయర్
ED lawyer in CBI court on kavitha arrest

రానున్న పది రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సమన్లు ఇవ్వమని మాత్రమే గత ఏడాది సెప్టెంబర్ 15న చెప్పామని, అదే సమయంలో విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేశామని ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుసేన్ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ఈడీ అధికారులు నిన్న కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ఆమెను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట శనివారం హాజరుపరిచారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా, ఈడీ తరఫున ఎన్.కే.మట్టా, జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు.

మీడియాలో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకోవద్దని ఈడీ న్యాయవాది కోర్టును కోరారు. రానున్న పది రోజుల్లో సమన్లు ఇవ్వం అని అప్పుడు చెప్పామన్నారు. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని చెప్పినట్లు వెల్లడించారు. ఒక ఆర్డర్ తనకు అనుకూలంగా ఉన్నంత మాత్రాన దానిని నిరవధిక కాలానికి వర్తింపచేసుకోవద్దన్నారు. అలాగే వేరేవారి ఉత్తర్వులను కూడా తమకు అన్వయించుకోవడం సరికాదన్నారు.

మధ్యంతర ఉత్తర్వులు మొత్తానికి వర్తించవన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకటన కోర్టు ఉల్లంఘన కిందకు రాదని, తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని కోర్టుకు తెలిపారు. కవిత వివిధ అంశాలపై సుప్రీంకోర్టుకు కేవలం విజ్ఞప్తి మాత్రమే చేశారని గుర్తు చేశారు.

More Telugu News