Malladi Vishnu: నేను బీజేపీతో టచ్ లో ఉన్నాననేది అవాస్తవం: వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

  • మల్లాది విష్ణు బీజేపీలో చేరి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం
  • ఖండించిన మల్లాది విష్ణు
  • తాను వైసీపీలోనే ఉంటానని స్పష్టీకరణ
YCP MLA Mallladi Vishnu condemns rumors

ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల్లో ఉన్నట్టే అధికార వైసీపీలోనూ అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బీజేపీలో చేరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మల్లాది విష్ణు స్పందించారు. 

తాను బీజేపీ వాళ్లతో టచ్ లో ఉన్నానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. తాను వైసీపీలోనే ఉంటానని అన్నారు. జగన్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం అని మల్లాది విష్ణు ఉద్ఘాటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. జగన్ సారథ్యంలో ఏపీ అన్ని రంగాల్లో ముందంజ వేస్తోందని అన్నారు. 

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల తీరును 2014 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాల రీత్యా చూశామని, రాజకీయ అవసరాల కోసం కలుస్తారే తప్ప, ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీలు కాదని అన్నారు.

"ఈ పొత్తులు విఫలం కావడం మనం గతంలో చూశాం. టీడీపీ, జనసేన వాళ్లు నాడు మోదీని, మోదీ ప్రభుత్వాన్ని ఎన్ని విధాలుగా విమర్శించారో, ఎన్ని బూతులు తిట్టారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. జగన్ ను ఎదుర్కోలేక ఓ చెయిన్ లా తయారవుతున్నారు" అని విమర్శించారు.

More Telugu News