Gutha Sukender Reddy: రేవంత్ రెడ్డి పాలనపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారని వ్యాఖ్య
  • తాను ఏ పార్టీకి సంబంధం లేని రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నానని వెల్లడి
  • తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
Gutha Sukhender Reddy interesting comments on revanth reddy government

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీకి సంబంధం లేని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని, పార్టీ మారాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో క్షేత్రస్థాయిలో నిర్మాణ లోపం ఉందన్నారు.

తనకు రేవంత్ రెడ్డి బంధువు అయినప్పటికీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాత్రమే కలిశానన్నారు. బయట ఆయనను ఎప్పుడూ కలవలేదని వివరణ ఇచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. తన తనయుడు గుత్తా అమిత్‌కు కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ప్రతిపాదన వచ్చిందని... కానీ ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొందరు నేతలు అమిత్‌కు సహకరించకపోవడంతో పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నుంచి పోటీకి అమిత్ దూరంగా ఉన్నట్లు వెల్లడించారు.

More Telugu News