Mudragada Padmanabham: సస్పెన్స్‌కు తెర.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం.. వీడియో ఇదిగో!

  • కుమారుడితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్న కాపు ఉద్యమ నేత
  • మొన్ననే చేరాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో కండువా
Mudragada Padmanabham Joins YCP Today

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సస్పెన్స్‌కు తెరదించారు. కొద్దిసేపటి క్రితం వైసీపీలో చేరారు. ఈ ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముద్రగడతోపాటు ఆయన తనయుడు గిరి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.

ముద్రగడ రాజకీయ పార్టీలో చేరబోతున్నట్టు ఇటీవల ప్రచారం జరగడంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు కూడా జరపడంతో ఆ పార్టీలో చేరడం ఖాయమని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా వైసీపీలో చేరబోతున్నట్టు ముద్రగడ ఇటీవల ప్రకటించారు. మొన్ననే ఆయన పార్టీలో చేరాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు నేడు వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ నేతగా మారారు.

ముద్రగడ 1978లో జనతా పార్టీలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ స్థాపించాక అందులో చేరారు. ఉమ్మడి ఏపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. 1999 ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రిగానూ పనిచేశారు.

More Telugu News