బెంగళూరు పరిస్థితి హైదరాబాద్ కు రావొద్దు..: హైకోర్టు

  • నీటి కొరత తీవ్రం కాకముందే మేల్కొండి
  • అధికారులను హెచ్చరించిన హైకోర్టు
  • ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని హితవు
నీటి కరవుతో అల్లాడుతున్న బెంగళూరు పరిస్థితి హైదరాబాద్ కు రానివ్వొద్దని అధికారులకు తెలంగాణ హైకోర్టు సూచించింది. ముందే జాగ్రత్త పడాలని, నీటి లభ్యత, వినియోగం మధ్య తేడాను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రస్తుతం బెంగళూరు వాసులు ఎదుర్కొంటున్న పరిస్థితి రేపు హైదరాబాదీలకు ఎదురవుతుందని హెచ్చరించారు. బెంగళూరు పరిస్థితి చూసైనా జాగ్రత్త పడాలని హితవు పలికింది. ఈమేరకు జంట నగరాలలో నీటి ఎద్దడి పెరిగిపోయిందని హైదరాబాద్ కు చెందిన పీఆర్ సుభాష్ చంద్రన్ అనే వ్యక్తి 2005లో రాసిన లేఖను పిటిషన్ గా స్వీకరించిన హైకోర్టు.. దీనిపై బుధవారం విచారణ చేపట్టింది.

ఈ విషయంపై ప్రభుత్వ లాయర్ కోర్టుకు వివరణ ఇచ్చారు. 2005 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని, ప్రస్తుతం జంట నగరాలకు సరిపడా తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. ఈ వివరణపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ప్రజల నిత్యావసరమని, ప్రభుత్వ వ్యతిరేక విషయం అనుకోవద్దని చెప్పింది. నీటి కొరతకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి తీసుకున్న చర్యలతో రిపోర్టు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. పిటిషన్ విచారణను బెంచ్ శనివారానికి వాయిదా వేసింది.

Water Crisis Alert
Hyderabad
Bengalore water problem
Telangana High Court

More Telugu News