Chandrababu: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా రేపు ప్రకటిస్తాం: చంద్రబాబు

  • ఇప్పటికే తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు
  • వీలైనంత మంది అభ్యర్థులతో రెండో జాబితా ప్రకటిస్తామన్న టీడీపీ అధినేత  
  • ప్రజలు గెలవాలనే పొత్తు పెట్టుకున్నామని స్పష్టీకరణ 
Chandrababu says TDP second list will release tomorrow

టీడీపీ ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ కలలకు రెక్కలు పథకం ప్రారంభించిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. 

జనసేన, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఆ రెండు పార్టీల వారికి స్పష్టత ఉందని అన్నారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు కూడా వారి అభ్యర్థులను ప్రకటిస్తాయని స్పష్టం చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. 

"పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి అని ప్రతివాళ్లు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పదేళ్లుగా కేంద్రంలో ఉంది. రేపటి ఎన్నికల్లోనూ బీజేపీనే వస్తుందని అందరూ చెబుతున్నారు. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు రాకపోయినా, ఉత్తరాదిలో వారిదే ప్రభంజనం అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన విధ్వంసంతో 30 ఏళ్లు వెనక్కివెళ్లిపోయాం. రాష్ట్రాన్ని పునర్ నిర్మించాలంటే... నిధులు, అనుమతులు, క్లియరెన్సులు ఇలా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా అవసరం. 

ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర పునర్ నిర్మాణం చేయలేం. కొందరు... టీడీపీ-జనసేన పొత్తును ప్రశ్నిస్తున్నారు. మేం జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే ఓట్లు చీలిపోయి మళ్లీ వీళ్లే గెలుస్తారు... రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. 

సీట్ల పంపకం అయిపోయిన తర్వాత కూడా... ఎప్పుడు లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారంటూ జనసేన పార్టీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ జాతీయ పార్టీ... మీకు ఇన్ని సీట్లేనా అంటూ బీజేపీ వాళ్లను రెచ్చగొడుతున్నారు. ఆరోజు పవన్ కల్యాణ్ కూడా చెప్పింది... ఓటు చీలకూడదు అని స్పష్టం చేశాడు. నేను కూడా గర్వానికి పోలేదు. నేను 14 ఏళ్లు సీఎంగా చేశాను, కేంద్రంలోనూ చక్రం తిప్పాం. 

నేను ఎక్కడికీ పోను, ఎవరితోనూ సర్దుబాటు చేసుకోను అని భీష్మించుకు కూచుంటే ఎవరికి లాభం? అందుకే ప్రజాహితం కోసం, ప్రజల భవిష్యత్ కోసం అందరం రాజీపడ్డాం. ఇది రాష్ట్ర హితం కోసం కుదుర్చుకున్న పొత్తు తప్ప, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, రాజ్యాధికారం కోసమో కుదుర్చుకున్న పొత్తు కాదు" అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

చిలకలూరిపేట రగడపై చంద్రబాబు స్పందన

చిలకలూరిపేట వైసీపీ టికెట్ పై నెలకొన్న సంక్షోభంపై చంద్రబాబు స్పందించారు. చిలకలూరిపేట నుంచి మంత్రి రజనిని బదిలీ చేశారని, అదే ఒక తప్పు అయితే, చిలకలూరిపేట టికెట్ పేరిట మల్లెల రాజేశ్ నాయుడు అనే వ్యక్తి నుంచి రూ.6.5 కోట్లు తీసుకోవడం మరో తప్పు అని వ్యాఖ్యానించారు. 

"మంత్రి మరో నియోజకవర్గానికి బదిలీ అవుతూ... నేను గుంటూరు పోతున్నా, నీకు చిలకలూరిపేట ఇస్తాం అని మల్లెల రాజేశ్ తో చెప్పారు. అతడు వెంటనే పారాచూట్ వేసుకుని దిగిపోయాడు. దీనికి సంబంధించి రూ.6.5 కోట్లతో సెటిల్ మెంట్ చేశారు. ఆవిడ, గ్రేట్ అడ్వైజర్ సజ్జల ఈ సెటిల్మెంట్ చేశారు. అతడొక బ్రోకర్. వీళ్లు నా గురించి, పార్టీల గురించి విమర్శిస్తారు. ఆ తర్వాత రాజేశ్ ను కాదని మనోహర్ అనే వ్యక్తిని చిలకలూరిపేట తీసుకువచ్చారు. అతడు మరొక పారాచూట్. మల్లెల రాజేశ్ గొడవ పెట్టుకోవడంతో సెటిల్మెంట్ లో సగం ఇచ్చేశారు. రాష్ట్ర రాజకీయాలు ఎంత దయనీయంగా  ఉన్నాయో చూడండి" అని చంద్రబాబు వివరించారు. 

More Telugu News