Mudragada Padmanabham: ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీలో చేరిక వాయిదా.. కారణం ఏమిటంటే..!

  • సెక్యూరిటీ కార‌ణాల‌తో కిర్లంపూడి నుంచి తాడేప‌ల్లి ర్యాలీ ర‌ద్దు
  • ఈ నెల 15 లేదా 16వ తేదీన ముద్ర‌గ‌డ మాత్ర‌మే సీఏం జ‌గ‌న్‌ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిక‌
  • ఈమేర‌కు ప్ర‌జ‌ల‌కు లేఖ రాసిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం
Mudragada Padmanabham YCP Joining is postponed

కాపునేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీలో చేరిక వాయిదా ప‌డింది. గ‌తంలో గురువారం (మార్చి 14న‌) వైసీపీలో చేర‌తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే, సెక్యూరిటీ కార‌ణాల‌తో కిర్లంపూడి నుంచి తాడేప‌ల్లి ర్యాలీని ర‌ద్దు చేసుకున్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ముద్ర‌గ‌డ మాత్ర‌మే సీఏం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌నున్నట్లు తెలియజేశారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. ముద్ర‌గ‌డ ఓ లేఖ రాయ‌డం జ‌రిగింది.  

 "గౌర‌వ ప్ర‌జ‌ల‌కు మీ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం శిర‌స్సు వంచి న‌మ‌స్కార‌ముల‌తో క్ష‌మించ‌మ‌ని కోరుకుంటున్నాను. 14.03.2024 తేదీన గౌర‌వ ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి వ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పిలుపు మేర‌కు వైఎస్ఆర్‌సీపీలోకి మీ అంద‌రి ఆశీస్సుల‌తో వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకుని మీకు లేఖ ద్వారా తెలియ‌ప‌ర్చి ఉన్నానండి.. ఊహించిన దానిక‌న్నా భారీ స్థాయిలో స్పంద‌న రావ‌డం మీద‌ట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వ‌ల్ల ఎక్కువ మంది వ‌స్తే కూర్చోడానికి కాదు, నిల‌బ‌డ‌డానికి కూడా స్థ‌లం స‌రిపోద‌ని మ‌రియు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రిని చెక్ చేయ‌డం చాలా ఇబ్బంద‌ని చెప్ప‌డం వ‌ల్ల తాడేప‌ల్లికి మ‌న‌మంద‌రం వెళ్లే కార్య‌క్ర‌మం ర‌ద్దు చేసుకున్నానండి.. మిమ్మ‌ల్ని నిరుత్సాహ‌ప‌ర్చినందుకు మ‌రొకసారి క్ష‌మాప‌ణ కోరుకుంటున్నానండి.. ఈ నెల 15 లేక 16వ తేదీల‌లో నేను ఒక్క‌డినే తాడేప‌ల్లి వెళ్లి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలోకి చేర‌తానండి.. మీ అంద‌రి ఆశీస్సులు వారికి, నాకు త‌ప్ప‌కుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి" అని ముద్ర‌గ‌డ త‌న లేఖ ద్వారా తెలియ‌జేశారు.

More Telugu News