AP Group 1: 2018లో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు

  • మెయిన్స్ పేపర్ ను రెండు సార్లు మూల్యాంకనం చేయించారంటూ పిటిషన్
  • నచ్చిన వారిని ఎంపిక చేసి ఫలితాలను ప్రకటించారని ఆరోపణ
  • మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు తీర్పు
AP High Court cancels 2018 Group 1 mains

2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అప్పుడు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. వివరాల్లోకి వెళ్తే... మెయిన్స్ జవాబు పత్రాలను చేతితో దిద్దే (మాన్యువల్) విధానం ద్వారా రెండు సార్లు మూల్యాంకనం చేశారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి మూల్యాంకనం చేసిన ఫలితాలను పక్కన పెట్టి, రెండోసారి మళ్లీ మూల్యాంకనం చేయించి నచ్చిన వారిని ఎంపిక చేసి ఏపీపీఎస్సీ ఫలితాలను ప్రకటించిందని పిటిషన్ లో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. 

మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్ట విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయాలని ఆదేశించింది. మళ్లీ మెయిన్స్ పరీక్షను నిర్వహించాలని... 6 వారాల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై గ్రూప్-1 ద్వారా ఎంపికైన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ఈ తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

More Telugu News