Amit Shah: సీఎం రేవంత్ రెడ్డిని సవాల్ చేసిన కేంద్రమంత్రి అమిత్ షా!

  • కాంగ్రెస్ కుంభకోణాల పార్టీ కాదని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పగలడా? అని ప్రశ్న
  • 400 సీట్లు గెలిచి మోదీకి కానుకగా ఇద్దామని పిలుపు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాయని ఆరోపణ
Amit Shah in LB stadium public meeting

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి... కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ కాదని ఆయన చెప్పగలడా? అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సవాల్ చేశారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేవంత్ రెడ్డికి దమ్ముంటే తాము చెప్పేది అబద్దమని చెప్పాలన్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడకు వెళ్లినా మోదీ నామస్మరణే వినిపిస్తోందన్నారు. 400 ఎంపీ సీట్లు గెలిచి మోదీకి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ 12కు పైగా లోక్ సభ స్థానాలు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ పార్టీ నేతను చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ అజెండానే అనుసరిస్తాయని విమర్శించారు. ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే అన్నారు. బీజేపీ 400కు పైగా లోక్ సభ స్థానాలు గెలిచి నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు.

బోఫోర్స్ నుంచి 2 జీ స్కామ్ వరకు కాంగ్రెస్ అన్నింటా అవినీతికి పాల్పడిందని జాబితాను చదివారు. కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇక, మియాపూర్ భూములు, ఔటర్ రింగ్ రోడ్డు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు. కానీ నరేంద్ర మోదీ 23 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఉన్నప్పటికీ అవినీతి మచ్చ లేదన్నారు. ఓబీసీ, దళితులకు న్యాయం చేసే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. బీజేపీని గెలిపిస్తే నిజాం పాలన ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నారు.

బీఆర్ఎస్ అంటే భారతీయ భ్రష్టాచార్ సమితి అని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు. బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక అయోధ్య రామమందిరం నిర్మించామని, ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ ప్రజలకు న్యాయం చేశామన్నారు. సీఏఏ ఏ మతానికీ వ్యతిరేకం కాదని గుర్తించాలన్నారు. సీఏఏ విషయంలో రాహుల్ గాంధీ, మజ్లిస్, ప్రతిపక్ష పార్టీలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

More Telugu News