BJP: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైనీ

  • బీజేఎల్పీ నేతగా నాయబ్ సైనీని ఎన్నుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు
  • మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో తెరపైకి నాయబ్ సైనీ
  • కురుక్షేత్ర ఎంపీగా ఉన్న నాయబ్ సైనీ
Nayab Singh Saini to replace Manohar Lal Khattar as Haryana CM

హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైనీని ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. ప్రస్తుతం ఆయన కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. ఆయన కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనను బీజేఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించారు. నాయబ్ సైనీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ ఇవ్వనున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో హర్యానా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

నాయబ్ సైనీ ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయకుడు. గత ఏడాది బీజేపీ ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. 1996 నుంచి బీజేపీలో క్రమంగా ఎదిగారు. 2002లో బీజేపీ అంబాలా జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, 2005లో అంబాలా జిల్లా యువ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో బీజేపీ హర్యానా రాష్ట్ర కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అయ్యారు. 2014లో నారాయణగఢ్ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2016లో మనోహర్ లాల్ ఖట్టర్ కేబినెట్లో చేరారు. 2019లో కురుక్షేత్ర నుంచి పోటీ చేసి గెలిచి లోక్ సభలో అడుగు పెట్టారు. 2023లో బీజేపీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు బీజేపీ అధిష్ఠానం ఆయనను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది.

More Telugu News