Asha Bhosle: మ‌న‌వ‌రాలి సినీ ఎంట్రీపై ఆశా భోంస్లే కీల‌క ప్ర‌క‌ట‌న‌

  • మ‌న‌వ‌రాలు జ‌నై భోంస్లే సినిమాల్లో స‌క్సెస్ కావాల‌ని ఆకాంక్షించిన ఆశా భోంస్లే
  • 'ది ప్రైడ్ ఆఫ్ భార‌త్‌-ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్' చిత్రం ద్వారా జ‌నై భోంస్లే సినీ ఎంట్రీ
  • జనైని సినిమా ప్ర‌పంచంలోకి స్వాగ‌తించిన‌ న‌టి శ్రద్ధా కపూర్
Asha Bhosle announces granddaughter Zanai debut in cinema

ప్రముఖ గాయని ఆశా భోంస్లే సోమవారం తన మనవరాలు జ‌నై భోంస్లే సినీ ఎంట్రీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆమె తన 'ఎక్స్‌' (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా భారతీయ సినిమాల్లోకి త‌న మ‌న‌వ‌రాలు ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు.

"ది ప్రైడ్ ఆఫ్ భార‌త్‌-ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ చిత్రంలో నా అంద‌మైన మ‌న‌వ‌రాలు జ‌నై భోంస్లే భాగం కావ‌డం ప‌ట్ల నిజంగా చాలా సంతోషిస్తున్నాను. సినీ ప్ర‌పంచంలో జనై కోరుకుంటున్న‌ గమ్యస్థానాన్ని చేరుకుంటుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఆమెకు, సినిమా తీస్తున్నద‌ర్శ‌కుడు సందీప్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అని ఆమె తన పోస్ట్‌లో రాశారు. 

ఇక ఆశా భోంస్లే పోస్ట్ ప్రకారం 'ది ప్రైడ్ ఆఫ్ భారత్ - ఛత్రపతి శివాజీ మహారాజ్' పేరుతో రాబోయే చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి భోంసాలే పాత్రలో ఆమె మనవరాలు జ‌నై కనిపించనుంది. ఈ చిత్రం ద్వారా సందీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇమ్మెర్సో స్టూడియో, లెజెండ్ స్టూడియో కలిసి దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 19, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో జనైని ఎంపిక చేయడం పట్ల చిత్ర నిర్మాత సందీప్ సింగ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. "ఛత్రపతి శివాజీ మహారాజ్ కుటుంబ వంశానికి చెందిన వారసుడు, చాలా తెలివైన, నిష్ణాతులైన కుటుంబంతో తన వంశాన్ని పంచుకున్న జ‌నైని ప‌రిచ‌యం చేయ‌డం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. దివంగత లతా మంగేష్కర్జీ, ఆశా భోంసలేజీ లకు మనవరాలు. రాణి సాయి బాయి పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేస్తుంది" అని అన్నారు.

ఆశా భోంస్లేతో పాటు బాలీవుడ్ న‌టి శ్రద్ధా కపూర్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా జ‌నైని చిత్ర పరిశ్రమకు స్వాగతించింది. ''మేరీ బెహెన్ ఫిల్మో మే ఆనే వాలీ హై.. హమ్ సబ్‌కో ఎంటర్‌టైన్ కర్నే'' అని జనైతో కలిసి ఉన్న ఫోటోను శ్రద్ధా పోస్ట్ చేసింది.

More Telugu News