Sowmya Janu: టాలీవుడ్ నటికి హైకోర్టులో ఊరట

  • ఇటీవల కారును రాంగ్ రూట్లో నడిపిన నటి సౌమ్య జాను
  • అడ్డుకున్న హోంగార్డ్ పై దురుసు ప్రవర్తన
  • కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు
  • తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నటి
Actress Sowmya Janu gets relief in Telangana High Court

టాలీవుడ్ నటి సౌమ్య జాను తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఊరట పొందింది. ఇటీవల సౌమ్య జాను కారును రాంగ్ రూట్లో నడుపుతూ, అడ్డుకున్న హోంగార్డ్ పై తీవ్ర పదజాలంతో  విరుచుకుపడింది. ఆ హోంగార్డుపై దాడికి యత్నించింది. దాంతో ఆ హోంగార్డు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నటి సౌమ్య జానుపై కేసు నమోదైంది. 

అయితే, పోలీసులు తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కోరుతూ సౌమ్య జాను తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ పై ఇవాళ విచారించిన ధర్మాసనం... చట్టప్రకారం 41ఏ కింద నోటీసులు ఇచ్చాకే అదుపులోకి తీసుకోవాలని, అప్పటివరకు ఆమెపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అంతేకాదు, దర్యాప్తు అధికారికి విచారణలో సహకరించాలని నటి సౌమ్య జానుకు స్పష్టం చేసింది. 

కాగా, పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం, నేర నిరూపణ అయితే నటి సౌమ్య జానుకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News