Bengaluru: గత 40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు: డీకే శివకుమార్

  • బెంగళూరులో తీవ్ర నీటి కొరత
  • గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్న బెంగళూరు వాసులు
  • ఏడు వేల వరకు బోరుబావులు ఎండిపోయిన వైనం
  • వాటర్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తున్నామన్న డీకే 
DK Shivakumar reacts on water crisis in Bengaluru

బెంగళూరు మహానగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడి కనిపిస్తోంది. నీటి కొరత సంక్షోభం స్థాయికి చేరుకుంది. కొద్దిపాటి నీరు దొరికినా చాలు అదే మహా భాగ్యం అని బెంగళూరు వాసులు భావిస్తున్నారు. బెంగళూరులో 13 వేలకు పైగా బోర్లు ఉండగా, వాటిలో 7 వేల వరకు ఎండిపోయాయి. దాంతో నీటికి కటకట ఏర్పడింది. 

వేసవిలో ఈ పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. రాష్ట్రంలో నీటి కోసం అలమటించి పోయే పరిస్థితులు గత 40 ఏళ్లలో ఇదే ప్రథమం అని తెలిపారు. నీటి కొరతను తీర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా వాటర్ మాఫియాకు కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

బెంగళూరు నగరంలో నీటికి డిమాండ్ అధికంగా ఉన్న దృష్ట్యా... నీటి ధరలు ప్రామాణికంగా ఉంచేందుకు చర్యలు ప్రారంభించామని డీకే శివకుమార్ తెలిపారు. వాటర్ ట్యాంకర్ల యజమానులు అధికారుల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించామని, ఇప్పటిదాకా 1,500 ట్యాంకర్ల యజమానులు వివరాలు నమోదు చేసుకున్నారని వెల్లడించారు.

More Telugu News