K Kavitha: అందరూ సమానంగా కూర్చోవాల్సిన గుడిలో అవమానిస్తారా? రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కవిత డిమాండ్

  • మల్లు భట్టి విక్రమార్క, కొండా సురేఖలను అవమానించారన్న కవిత
  • వారిని కింద కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనం కాదా? అని నిలదీత
  • అందరూ కూర్చునే పరిస్థితి లేకుంటే రేవంత్ రెడ్డి నిలబడాల్సిందన్న కవిత
Kavitha demands for revanth reddy apology

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... అందరూ సరిసమానంగా కూర్చోవాల్సిన యాదాద్రి దేవాలయంలో భట్టి విక్రమార్క, కొండా సురేఖలను కింద కూర్చోబెట్టి అగ్రవర్ణ నాయకులను పైన కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. ఈ వైఖరి పట్ల తాను బాధపడుతున్నానని... అందుకే తక్షణమే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఒకవేళ అక్కడ అందరికి సరిపోయేలా టేబుల్స్ లేకుంటే అందరూ నిలబడాల్సిందన్నారు. లేదంటే సీఎం రేవంత్ రెడ్డి తండ్రి స్థానంలో ఉన్నందున ఆయన లేచి నిలబడి ప్రసాదం తీసుకుంటే బాగుండేదని సూచించారు. గౌరవం ఇవ్వాలనే ఆలోచన ఉంటే ఇవ్వవచ్చునన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో రజకులు, ముస్లింలు, ముదిరాజ్‌లు, ఎస్టీలు, యాదవ, కుర్మా, వడ్డెర, విశ్వబ్రాహ్మణులు లేరన్నారు. ప్రభుత్వ సలహాదారుల్లో అందరూ అగ్రవర్ణాలవారేనని... ఒక్కరూ బీసీ, ఎస్టీలు లేరన్నారు.

More Telugu News