Revanth Reddy: ఖమ్మం ప్రజలు మొదటి నుంచి కేసీఆర్‌ను నమ్మలేదు: ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి

  • పేదల కష్టాలను చూసి ఆ రోజు ఇందిరమ్మ ఉచిత ఇళ్ళను ప్రారంభించినట్లు చెప్పిన ముఖ్యమంత్రి
  • భద్రాచల రామచంద్రుడి ఆశీస్సులు తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడి
  • ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయన్న సీఎం   
Revanth Reddy says khammam people never trusted kcr

ఖమ్మం ప్రజలు మొదటి నుంచి కేసీఆర్‌ను నమ్మలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పేదల కష్టాలను చూసి ఆ రోజు ఇందిరమ్మ ఈ ఇళ్ళను ప్రారంభించినట్లు చెప్పారు. భద్రాచల రామచంద్రుడి ఆశీస్సులు తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటే బడుగుల ఆత్మగౌరవమని వ్యాఖ్యానించారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని పేర్కొన్నారు. మహిళ చేతిలో ఇంటి నిర్వహణ ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశారని ఆరోపించారు. పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు. తాము నాలుగున్నర లక్షల మందికి ఇళ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని గుర్తు చేశారు. గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందిస్తున్నామన్నారు.

తాము డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని... కానీ ఏ ఊరిలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో ఆ ఊర్లో మేం ఓట్లు అడగం... ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఊళ్లో వాళ్లు అడవగద్దని... ఈ సవాల్‌కు వారి సిద్ధమేనా? అని ప్రశ్నించారు. తన ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు.

More Telugu News