Hyderabad woman: ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త

  • మృతదేహాన్ని డస్ట్ బిన్ లో కుక్కి ఊరి చివర పడేసిన హంతకుడు
  • మృతురాలి భర్తను అనుమానిస్తున్న విక్టోరియా పోలీసులు
  • ఇతర కోణాల్లోనూ విచారిస్తున్నట్లు మీడియాకు వెల్లడి
Australia police investigating murder of Hyderabad woman

హైదరాబాద్ కు చెందిన మహిళ ఆస్ట్రేలియాలో హత్యకు గురైంది. ఊరి చివర డస్ట్ బిన్ లో మహిళ మృతదేహం గుర్తించిన పోలీసులు.. మృతురాలు చైతన్య మాధగాని అని గుర్తించారు. విక్టోరియాలోని బక్లీలో వెలుగుచూసిందీ దారుణం. చైతన్య హత్యకు గురైన విషయం ఆమె భర్తకు తెలియజేసేందుకు ప్రయత్నించిన పోలీసులకు ఆయన అప్పటికే ఇండియా వెళ్లినట్లు తెలిసింది. దీంతో చైతన్యను ఆమె భర్తే చంపి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విక్టోరియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బక్లీ శివార్లలోని చెట్ల మధ్య అనుమానాస్పదంగా కనిపించిన ఓ డస్ట్ బిన్ గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. బిన్ ను ఓపెన్ చేసి చూడగా లోపల ఓ మహిళ మృతదేహం కనిపించింది. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో చనిపోయింది చైతన్య అని గుర్తించారు. ఇది హత్యేనని, హంతకుడు ఆమెను వేరే చోట చంపి, మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటాడని పోలీసులు చెప్పారు. చైతన్య భర్త అశోక్ రాజ్ కు సమాచారం అందించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందని అన్నారు.

మిర్కావేలోని పాయింట్ కుక్ లో అశోక్, చైతన్య నివసించే ఇంటికి వెళ్లగా.. ఫ్లాట్ కు తాళం వేసి ఉందని, అశోక్ ఇటీవలే ఇండియా వెళ్లాడని తెలిసిందన్నారు. దీంతో చైతన్య హత్యలో అశోక్ ప్రమేయం ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇతరత్రా కోణాల్లోనూ విచారిస్తున్నామని, తొందర్లోనే హంతకుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

More Telugu News