Nara Lokesh: హెయిర్ స్టయిల్ తప్ప ఇద్దరూ సేమ్ టూ సేమ్!: నారా లోకేశ్

  • ఉరవకొండలో శంఖారావం
  • వాడీవేడిగా నారా లోకేశ్ ప్రసంగం
  • నేడు దేశంలో ఎక్కడ చూసినా కియా కార్లేనని వెల్లడి
  • ఆంధ్రాలోనూ ఒక నియంత ఉన్నాడని, అతని పేరు జిమ్ అని సెటైర్లు
  • జిమ్ కూడా నార్త్ కొరియా కిమ్ లాంటివాడేనని ఎద్దేవా
Nara Lokesh satires on CM Jagan

ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ–లత్తవరం శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగించారు. నేడు దేశంలో ఎక్కడ చూసినా అనంతపురం జిల్లాలో తయారైన కియా కార్లే కనిపిస్తున్నాయని గర్వంగా చెప్పారు. కరవు సీమలో కార్ల పంట పండించి కియా అనుబంధ సంస్థల ద్వారా 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి పేరుపేరునా నా నమస్కారాలు అంటూ టీడీపీ శ్రేణులకు లోకేశ్ అభివాదం చేశారు. తన ప్రసంగంలో సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఆంధ్రాలో కూడా ఒక నియంత ఉన్నాడు... అతని పేరు జిమ్!

నార్త్ కొరియాలో నియంత ఉన్నాడు... ఆయన పేరు కిమ్. ఆంధ్రాలో కూడా ఒక నియంత ఉన్నాడు... అతని పేరు జిమ్. హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరూ సేమ్ టూ సేమ్. కిమ్ కు నార్త్ కొరియాలో 17 ప్యాలెస్ లు ఉంటే, జిమ్ కు ఇక్కడ 6 ప్యాలెస్ లు ఉన్నాయి. కిమ్ సొంత బాబాయిని లేపేశారు, సొంత అన్నని లేపేశారు. ఆంధ్రా జిమ్ కూడా సొంత బాబాయిని లేపేశాడు. జిమ్ సొంత తల్లి, చెల్లిని కూడా మెడపట్టుకుని గెంటేశాడు. 

కిమ్ వీడియో గేమ్ లు ఆడతాడు, జగన్ పబ్ జీ ఆడతాడు. కిమ్ దొంగ నోట్లు, మాదకద్రవ్యాలతో దోచుకుంటారు.  జిమ్ కూడా దొంగనోట్లు, గంజాయి డ్రగ్స్, నాసిరకం మందు విక్రయిస్తాడు. నార్త్ కొరియాలో కిమ్ 340 మందిని చంపేశాడు. ఆంధ్రా జిమ్ వేలాది మందిని జైలుకు పంపాడు. నార్త్ కొరియాలో కిమ్ తనను ప్రశ్నిస్తే.. సంక్షేమ పథకాలు కట్ చేస్తాడు. ఏపీలో జిమ్ కూడా అంతే. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా జైలుకు పంపిస్తాడు ఈ జిమ్. ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా... జగన్. నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని వెబ్ సైట్ లో కొడితే నేను చెప్పినవన్నీ వస్తాయి. 

జగన్... ప్రజలు ఏమనుకుంటున్నారో వెళ్లి చూద్దాం... నువ్వు సిద్ధమా?

జగన్ ను నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. డేట్, టైం నువ్వు ఫిక్స్ చేస్తే నీ బూమ్ బూమ్ షాపు వద్దకు వెళదాం... ప్రజలు ఏం అనుకుంటున్నారో చూద్దాం. నువ్వు సిద్ధమా? జగన్ రోజూ బూమ్, బూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, ప్రజల రక్తం రుచిమరిగారు. క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి నుంచి రోజు 25 రూపాయలు వసూలు చేస్తున్నారు. నెలకు రూ.750, ఏడాదికి రూ.9 వేలు, ఐదేళ్లలో 45 వేలు లాగేసుకుంటున్నారు. ఈ చేత్తో పది ఇచ్చి మరో చేత్తో 100 లాగేసుకుంటున్నారు. 

అందుకే బాబు సూపర్-6

ప్రజలు పడుతున్న కష్టాలు చూశాం. ఉరవకొండలో కూడా పాదయాత్ర చేశాను. అందుకే పవనన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్-6 హామీలు ప్రకటించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల రూ.3 వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తాం.

స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు ఇస్తాం. రైతు ఆత్మహత్యలు నివారించేందుకు ప్రతి ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటాం. 

ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఇక 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెల రూ.15 వందల చొప్పున, ఏడాదికి రూ.18 వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. 

మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతోంది. టీడీపీ-జనసేన కూటమి ఇటీవలే బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. 50 ఏళ్లు నిండిన బీసీలకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తాం. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం. 

చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు, పెళ్లి కానుక కింద బీసీలకు రూ.లక్ష అందిస్తాం. 

కేశవ్ కు మైకు ఇవ్వడంలేదంటే ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది! 

పయ్యావుల కేశవ్ మూడు తరాలకు వారధిగా నిలిచారు. ఎన్టీఆర్ దగ్గర శిక్షణ తీసుకున్నారు, బాబు గారి నాయకత్వంలో పనిచేశారు. ఈరోజు యువకుడిగా ఉన్న నాకు అన్నగా అండగా నిలబడి నాతో పరిగెత్తుతున్నారు. కేశవ్ నాయకత్వంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందింది. అసెంబ్లీలో కేశవ్ కి మైకు ఇవ్వడం లేదంటే ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది. అసెంబ్లీ పులి కేశవన్న. అసెంబ్లీలో పిల్లి కూడా ఉంది.. ఆ పిల్లి పేరు కిమ్ లాంటి జగన్.

ఈ నియోజవకర్గానికి విశ్వేశ్వరరెడ్డి చేసిందేమీ లేదు

వైసీపీ శాసనసభ్యుడు విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ఏనాడు నాకు ఇది కావాలని అప్పుడు, ఇప్పుడు అడగలేదు. జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఏనాడూ అడగలేదు. ఆయన, ఆయన కొడుకు కలిసి నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు. దొంగ ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, పత్రాలు సృష్టించి భూములు కొట్టేస్తున్నారు. పొరపాటున మీ ఇల్లు చూపిస్తే... మీ ఇల్లు నచ్చితే దానిని కూడా స్వాహా చేస్తారు. భూములు, ఇసుక స్వాహా చేస్తున్నారు.

More Telugu News