Revanth Reddy: చంద్రబాబుతో బీజేపీ పొత్తుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఎన్డీయే అతుకుల బొంత... ఏపీలోనూ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్య
  • ధర్నా చౌక్ వద్దన్న వారే అక్కడ ధర్నా చేస్తున్నారంటూ కవితపై ఆగ్రహం
  • ప్రభుత్వాన్ని కూల్చే మొగోడు ఉన్నాడా? అన్న రేవంత్ రెడ్డి
  • కూల్చే సత్తా ఎవరికీ లేదు... దమ్ముంటే టచ్ చేయాలన్న ముఖ్యమంత్రి
Telangana CM Revanth Reddy interesting comments on bjp tdp janasena alliance

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం మేడ్చల్ కాంగ్రెస్ ప్రజాదీవెన సభలో మాట్లాడుతూ... ఎన్డీయే మొత్తం అతుకుల బొంత అని విమర్శించారు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారన్నారు. 400 సీట్లు వస్తాయనే ధైర్యం ఉంటే ఏపీలో చంద్రబాబు ఎందుకు? ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఎందుకు? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో శివసేనను, ఎన్సీపీ పార్టీలను చీల్చారని ఆరోపించారు.

కర్ణాటకకు వెళ్లి దేవెగౌడతో... ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చంద్రబాబుతో, బీహార్‌లో నితీశ్ కుమార్‌తో పొత్తు పెట్టుకున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి వారితోనే పొత్తులకు దిగారని ఆరోపించారు. బీజేపీకి కాలం చెల్లిందన్నారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో కేడీని ఎలాగైతే బండకేసి కొట్టారో... ఢిల్లీలోని మోడీని బండకేసి కొట్టేందుకు 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆ విషయం మోదీకి తెలుసు కాబట్టే అతుకుల బొంతను తయారు చేసుకుంటున్నారన్నారు.

ధర్నా చౌక్ వద్దన్న వారే ధర్నా చేస్తారా? కవితపై తీవ్ర విమర్శలు

గతంలో ధర్నా చౌక్ వద్దన్న వారు ఇప్పుడు అదే ధర్నా చౌక్ వద్ద ధర్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాము 43 శాతం మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చామని, నీకు లెక్క కావాలంటే మీ అయ్యను అసెంబ్లీకి పంపించాలని సూచించారు. గతంలో ధర్నా చౌక్ వద్దని... ఇప్పుడు అక్కడే సిగ్గులేకుండా వెళ్లి ధర్నా చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తొలి కేబినెట్‌లో మహిళా మంత్రి ఒక్కరు కూడా లేరని గుర్తు చేశారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే ప్రతిపక్ష నేత భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వాన్ని కూల్చే మొగోడు ఉన్నాడా?

తానేమీ అయ్య పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల దీవెనతో వచ్చానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని అంటున్నారని... అంత మొగోడు తెలంగాణలో ఉన్నాడా? అని సవాల్ చేశారు. తమ కార్యకర్తలు తలుచుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు కదా... ఇటుక పెళ్లలు కూడా మిగలవని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు చేస్తే మా కార్యకర్తలు కళ్లలో కారం కొడతారన్నారు. దోచుకున్న డబ్బుతో వాడినో... వీడినో కొందామని చూస్తున్నారని ఆరోపించారు. కూల్చే సత్తా ఎవరికీ లేదన్నారు. ధైర్యం ఉంటే తమను టచ్ చేయాలని వ్యాఖ్యానించారు.

పిల్లర్లు కుంగిన మేడిగడ్డ నుంచి నీళ్లు ఇవ్వాలని పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ రిపేర్ చేయాలని అంటున్నారని... కానీ ఉంటుందో ఊడుతుందో తెలియదన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు 60 ఏళ్లయినా చెక్కు చెదరలేదన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కడితే మూడేళ్లకు కూలిపోయేలా కట్టారా? అని ప్రశ్నించారు. తాను ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తానని... మిగతా సమయం అభివృద్ధి కోసం చూస్తానన్నారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయస్థాయి అడుగు పడింది కాంగ్రెస్ హయాంలోనే అన్నారు.

More Telugu News