Sajjala Ramakrishna Reddy: బీజేపీతో ప్రయత్నాలు చేస్తూనే కాంగ్రెస్ ను లైన్ లో పెట్టారు: సజ్జల

  • పొత్తుల కోసం చంద్రబాబు నానా పాట్లు పడుతున్నారన్న సజ్జల
  • పొత్తే శరణ్యమంటూ చివరి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ
  • చంద్రబాబు మాటలే షర్మిల మాట్లాడుతున్నారని ఎద్దేవా
Chandrababu trying for alliance with BJP and Congress says Sajjala Ramakrishna Reddy

పొత్తుల కోసం చంద్రబాబు నానా పాట్లు పడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాట్లు చూస్తుంటే టీడీపీ ఎంత బలహీనంగా ఉందో... వైసీపీ ఎంత బలంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. చంద్రబాబు పూర్తి నిరాశ, నిస్పృహలో ఉన్నారని... అంతా అయిపోయిందని చెప్పారు. పొత్తే శరణ్యం అంటూ చివరి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఒకవైపు బీజేపీతో ప్రయత్నాలు చేస్తూనే ఇంకోవైపు కాంగ్రెస్ ను లైన్ లో పెట్టుకున్నారని చెప్పారు. చంద్రబాబు మాటలనే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారని అన్నారు. 

షర్మిల, పవన్ కల్యాణ్ లు చంద్రబాబు కోసం పని చేస్తున్నారని సజ్జల విమర్శించారు. బీజేపీతో పొత్తు కుదరకపోతే... కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా... వైసీపీ మాత్రం సింగిల్ గానే పోటీ చేస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని, జగన్ రెండోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన పార్టీలు కనిపించకుండా పోతాయని చెప్పారు.

More Telugu News