Chandrababu: ఢిల్లీ నుంచి టీడీపీ ముఖ్య నేతలకు చంద్రబాబు ఫోన్

  • ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు
  • నిన్న రాత్రి బీజేపీ అగ్రనేతలతో భేటీ
  • నేడు పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం 
Chandrababu talks to TDP leaders from Delhi

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గతరాత్రి అమిత్ షా, జేపీ నడ్డా వంటి బీజేపీ అగ్రనేతలను కలిసిన చంద్రబాబు పొత్తులపై స్పష్టత కోసం ఇవాళ కూడా హస్తినలోనే ఉన్నారు. చంద్రబాబు వెంట జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, నేడు చంద్రబాబు ఏపీలోని టీడీపీ ముఖ్యనేతలకు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. ఇటీవల సీట్ల ప్రకటన తర్వాత నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలను నాయకులు అర్థం చేసుకోవాలని, కలిసి పనిచేయాలని వారికి సూచించారు. 

12 నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. ఎన్నికలకు సమయం లేదని, పార్టీ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా ఎవరికి సీటు వచ్చినా గెలిపించేందుకు కలిసి పనిచేయాలని ఉద్బోధించారు. సీటు దక్కని ప్రతి ఒక్కరికీ పార్టీ న్యాయం చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు మాట్లాడిన నేపథ్యంలో, పార్టీ కోసం పనిచేస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. 

More Telugu News