Kalalaku Rekkalu: ప్రతి మహిళ, ప్రతి యువతి కలను నిజం చేయడానికే చంద్రబాబు, పవన్ ఈ పథకం తీసుకువచ్చారు: నన్నపనేని

  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • వైసీపీ పాలనలో మహిళా రక్షణ కొరవడిందన్న నన్నపనేని రాజకుమారి
  • స్త్రీల జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడమే టీడీపీ-జనసేన ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి 
Nannapaneni Rajakumari elaborates Kalalaku Rekkalu scheme

వైసీపీ ప్రభుత్వంలో కొరవడిన మహిళా రక్షణను చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు మాత్రమే పునరుద్ధరించగలరని టీడీపీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. 

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలకు, తెలుగుదేశం మహిళలకు ప్రత్యేక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రతి మహిళ, ప్రతి యువతి కలను నిజం చేయడానికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మహిళా దినోత్సవం సందర్భంగా ‘కలలకు రెక్కలు’ పేరుతో నూతన పథకాన్ని ప్రకటించారని నన్నపనేని రాజకుమారి తెలిపారు. మహిళలు, యువతుల ‘కలలకు రెక్కలు’ అందించి, వారి జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడమే టీడీపీ-జనసేన ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. 

ఈ పథకం కింద మహిళలు, యువతులు పొందే బ్యాంకు రుణానికి టీడీపీ-జనసేన ప్రభుత్వం హామీదారుగా ఉంటుందని తెలిపారు. కలలకు రెక్కలు పథకం రిజిస్ట్రేషన్ కోసం 92612 92612 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి... లేదా www.kalalakurekkalu.com వెబ్ సైట్లోకి లాగిన్ అవ్వండి అని వివరించారు. 

చంద్రబాబు స్వతహాగా మహిళా పక్షపాతి అని, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహిళల రక్షణ, ఆర్థిక స్వావలంబనకు ఆయన తీసుకున్న నిర్ణయాలే అందుకు నిదర్శనమని నన్నపనేని రాజకుమారి తెలిపారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేసి, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా శక్తిమంతుల్ని చేసిన ఘనత చంద్రబాబుది అని కొనియాడారు. 

మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, స్త్రీలపై, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని శిక్షించడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయించారని వెల్లడించారు. సర్వీస్ కమిషన్ లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి, వారు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్స్ ఉద్యోగాలలో రాణించి ప్రజాసేవలో ఎదిగేలా చేశారని వివరించారు.

More Telugu News