Bandi Sanjay: నేను గెలిస్తే బీఆర్ఎస్‌ను మూసేస్తారా?.. కేటీఆర్‌కు ప్రతి సవాల్ విసిరిన బీజేపీ నేత బండి సంజయ్

  • వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సంజయ్ 
  • తాను గెలిస్తే కేసీఆర్, కేటీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారా? అంటూ ప్రశ్న
  • ప్రజాహిత యాత్రలో భాగంగా గురువారం కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో పర్యటించిన ఎంపీ
Will you close BRS if I win BJP leader Bandi Sanjay threw challenge to KTR

అడ్డిమారి గుడ్డిదెబ్బగా కరీంనగర్ ఎంపీగా గెలిచారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి తాను గెలిస్తే బీఆర్ఎస్‌ను మూసేస్తారా? అంటూ ఆయన సవాల్ విసిరారు. ‘ఒకవేళ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. నేను గెలిస్తే కేసీఆర్‌, కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారా’’ అని అన్నారు. ప్రజాహిత యాత్రలో కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. 

చొప్పదండి అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌ అభివృద్ధిపై కేటీఆర్‌ చేసిన సవాలును స్వీకరిస్తున్నానని అన్నారు. చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, కేసీఆర్‌ను కూడా తీసుకు రావాలని అన్నారు. మహారాష్ట్రలో పార్టీ ఆఫీస్ తెరచి అద్దె చెల్లించకుండా అక్కడి నేతలను మోసం చేశారని కేసీఆర్, కేటీఆర్‌లపై సంజయ్ ఆరోపించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేనిపక్షంలో కరీంనగర్‌లో అడుగుపెట్టనీయబోమని ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ ఎప్పుడూ రాముడి పేరు చెబుతుంటారని తనను విమర్శిస్తున్నారని, రాముడి పేరు కాకపోతే రావణుడి పేరు చెప్పాలా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ వెంట మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.

కాగా కరీంనగర్‌కు ఎవరేం చేశారో చర్చిద్దామా? డేట్, టైమ్ నువ్వే ఫిక్స్ చెయ్... ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న బండి సంజయ్‌కి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. బండి సంజయ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదని కేటీఆర్ విమర్శించారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ అడ్డిమారి గుడ్డిదెబ్బగా గెలిచారన్నారు. ఎంపీగా ఈ నియోజకవర్గానికి ఆయన ఏం చేశారని ప్రశ్నించారు.

More Telugu News