KTR: రేవంత్ రెడ్డి పాలన చూశాక ప్రజలకు గాడిద ఎవరో... గుర్రం ఎవరో తెలుస్తుంది: కేటీఆర్

  • కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్
  • రేవంత్ రెడ్డి అబద్ధాల పాలన మీద మార్చి 12న సభ పెడుతున్నామన్న కేటీఆర్
  • ఓ ముఖ్యమంత్రి అయి ఉండి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాను.. మానవ బాంబును అవుతానని మాట్లాడటం ఏమిటని ఆగ్రహం
  • రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి ముప్పు లేదని కేటీఆర్ హామీ
  • కాంగ్రెస్‌లో నీ పక్కన ఉన్న వారితోనే ప్రమాదమని హెచ్చరిక
KTR fires at revanth reddy for his comments in mahaboobnagar

ఎవరు గాడిదో... ఎవరు గుర్రమో... ప్రజలకు కూడా తెలియాలి... అందుకే రేవంత్ రెడ్డి అయిదేళ్లు పాలన చేయాలి... అప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూశాక కేసీఆర్ గొప్పతనం తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నాడు ఆంధ్రా పాలన మీద 2001లో కేసీఆర్ కరీంనగర్‌లో సింహగర్జన పెట్టారని... ఇప్పుడు అబద్ధాల రేవంత్ రెడ్డి పాలన మీద మార్చి 12న మరోసారి కదనభేరి మోగించేందుకు పార్టీ సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

నిన్న మహబూబ్ నగర్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నానని... కడుపు చింపుతానని... పేగులు మెడలో వేసుకొని తిరుగుతానని... మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులా మారుతానని అంటున్నారని.. ఇవేం మాటలు? అని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎక్కడైనా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతారా... జేబు దొంగలే అలా తిరుగుతారని ఎద్దేవా చేశారు. అంతకుముందేమో సచివాలయానికి వచ్చి లంకె బిందెలు దొరుకుతాయని భావించానని అన్నాడని గుర్తు చేశారు. ఈ లంకె బిందెలు ఏంది? జేబులో కత్తెర ఏంది? అని చురక అంటించారు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా ఇవి... ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఆవేశంతో ఊగిపోవడం ఎందుకు? అని మండిపడ్డారు. 

తాను రేవంత్ రెడ్డికి ఓ విజ్ఞప్తి చేస్తున్నానని... కాంగ్రెస్ పార్టీలో నీ పక్కనే బాంబులు ఉన్నాయని... నల్గొండ బాంబు, ఖమ్మం బాంబులు మీ ప్రభుత్వం మీద చేసేదంతా వారే చేస్తారన్నారు. రేవంత్ రెడ్డి అయిదేళ్లు అధికారంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని... 420 హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. వెలుగు... చీకటి రెండూ చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని... అలాగే కేసీఆర్, రేవంత్ రెడ్డిని చూశాక కేసీఆర్ విలువ ప్రజలకు తెలుస్తుందన్నారు. అందుకే రేవంత్ రెడ్డి బీపీ పెంచుకొని ఆగమాగం కావొద్దని.. మా నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ప్రమాదం అంటూ ఉన్నదంటే ఆయన పక్కన కూర్చున్న కాంగ్రెస్ నేతల నుంచే అన్నారు. బీపీ గోలీలు వేసుకొని హాయిగా ఉండాలని వ్యాఖ్యానించారు.

గుజరాత్ మోడల్ గొప్పదని రేవంత్ రెడ్డి అంటున్నారని... నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. మన రైతుబంధును కాపీ కొట్టి కేంద్రం పీఎం కిసాన్ పెట్టిందని తెలిపారు. అలాగే మిషన్ కాకతీయను కాపీ కొట్టి అమృత్ సరోవర్ అని పేరు పెట్టారన్నారు. రాహుల్ గాంధీయేమో గుజరాత్ మోడల్ అట్టర్ ప్లాప్ అంటే.. రేవంత్ రెడ్డేమో గుజరాత్ మోడల్ కావాలని అంటున్నారని ధ్వజమెత్తారు. మూడు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాభిమానం కోల్పోయిందన్నారు.

More Telugu News