Nara Lokesh: మా జిల్లా నుంచి ఒకడొచ్చాడు: నారా లోకేశ్

  • నారా లోకేశ్ శంఖారావం యాత్ర కొనసాగింపు
  • నేడు హిందూపురంలో సభ
  • పాపాల పెద్దిరెడ్డి అంటూ విమర్శలు
  • జగన్ ది దరిద్రపు పాదం అంటూ వ్యంగ్యం 
  • సూపర్-6 పథకాలను వివరించిన వైనం
Nara Lokesh take a dig at Peddireddy

టీడీపీ జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రను మళ్లీ షురూ చేశారు. ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అగ్రనేతలపై విరుచుకుపడ్డారు. 

"మా జిల్లా నుంచి ఒకడొచ్చాడు. వాడి పేరు పాపాల పెద్దిరెడ్డి. మా సొంత జిల్లా చిత్తూరును క్యాన్సర్ లా తినేస్తున్నాడు. అక్కడ నేను పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడికి వెళ్లినా పీఎల్ఆర్ పేరుతో టిప్పర్లు కనిపించేవి. ఆ టిప్పర్లను ఎవరూ ఆపరు. ప్రతి టిప్పర్ లో ఇసుక, మద్యం ఫుల్. ఏకంగా గ్రావెల్ కూడా కొట్టేస్తున్నారు. అలాంటి వాళ్లను మన నియోజకవర్గానికి రానిస్తే క్యాన్సర్ గడ్డలా తినేస్తారు. చిత్తూరు ప్రజలు ఇప్పటికే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడకు వస్తే తరిమితరిమి కొట్టాలని హిందూపురం ప్రజలకు పిలుపునిస్తున్నా" అని వ్యాఖ్యానించారు. 

టీడీపీ బలం కార్యకర్తలేనని, నాయకులు పార్టీ మారి వెళ్లినా కార్యకర్తలు అండగా నిలబడ్డారని కొనియాడారు. వైసీపీ కార్యకర్తలకు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కావాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారి పిలుపు మేరకు రా.. కదలిరా.. అంటే చాలు... మన కార్యకర్తలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అని గర్వంగా చెప్పారు. 

"2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటుచేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబాలకు 2 లక్షల బీమా అందజేసి ఆదుకున్నాం. ఇందుకు 100 కోట్లు ఖర్చుపెట్టాం. పిల్లలను చదివించలేకపోతే వారిని దత్తత తీసుకుని చదివిస్తోంది నా తల్లి భువనేశ్వరమ్మ. అదీ... కార్యకర్తల పట్ల మా చిత్తశుద్ధి" అని వివరించారు. 

"నాకు అక్కచెల్లెళ్లు లేరు, అన్నాదమ్ములు లేరు. అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములను ఇచ్చారు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడతా" అని లోకేశ్ స్పష్టం చేశారు. 

బాలయ్య బాబు హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

టీడీపీకి కంచుకోట అంటే గుర్తుకువచ్చే మొదటి నియోజకవర్గం హిందూపూర్. మా కుటుంబాన్ని ఆశీర్వదించింది, దీవించింది హిందూపూర్ నియోజకవర్గం. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత హిందూపూర్ నియోజకవర్గానికి దక్కుతుంది. మా మావయ్య హరికృష్ణ గారిని కూడా శాసనసభకు పంపించిన నియోజకవర్గం హిందూపూర్. 

రెండో మామయ్య నందమూరి బాలకృష్ణని రెండుసార్లు శాసనసభకు పంపించిన ఘనత ఈ హిందూపూర్ ది. టీడీపీ హయాంలో హిందూపూర్ ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. ఆనాడు బాలకృష్ణ రూ.2వేల కోట్లు ఖర్చుపెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేసి ఏకంగా హిందూపూర్ పట్టణానికి తాగునీరు అందించిన వ్యక్తి బాలయ్య బాబు. పంటకుంటలు తవ్వారు. 

సీసీ రోడ్లు వేశారు. ఆసుపత్రులు అప్ గ్రేడ్ చేశారు. తాగునీటి ట్యాంక్ లు ఏర్పాటుచేశారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించారు. నేను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాలయ్య బాబు నుంచి కాగితం రావడమే ఆలస్యం... వెంటనే సంతకం పెట్టి శాంక్షన్ చేసి పంపేవాడ్ని. 

టిడ్కో కింద 2800 ఇళ్లు కట్టించిన ఘనత బాలయ్యది. లేపాక్షి ఉత్సవాలు, కోవిడ్ సమయంలో రూ.3 కోట్ల 50 లక్షల సొంత నిధులుతో వెంటలేటర్లు, కిట్ లు పంపిణీ చేసిన వ్యక్తి మన బాలయ్య. అన్న క్యాంటీన్లు కూడా మళ్లీ ప్రారంభించారు. ఆరోగ్య రథం, బసవతారకం క్యాన్సర్ స్ర్కీనింగ్ బస్సు కూడా మన నియోజకవర్గానికి అనేక సార్లు తీసుకువచ్చారు. బ్రహ్మణి దగ్గర నుంచి సీఎస్ఆర్ ఫండ్లు తీసుకుని మొత్తం హిందూపూర్ నియోజకవర్గానికి ఖర్చుపెట్టారు. 

మన బాలయ్య బాబు నీతి, నిజాయతీగా పరిపాలన అందించారు. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా.. ఆయన హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. ఏపీలోనే ఎవరికి రాని భారీ మెజార్టీతో బాలయ్య బాబుని గెలిపించి శాసనసభకు పంపించాలని కోరుతున్నా. 

జగన్ ది దరిద్రపు పాదం

జగన్ ది దరిద్రపు పాదం. ఆయన మొదటిసారి వస్తానంటే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకైంది. రెండోసారి ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలిపోయాయి. నిన్నగాక మొన్న బైజూస్ సెంటర్ తగలబడిపోయింది. ఈసారి ఉత్తరాంధ్ర నుంచి ప్రమాణస్వీకారం చేస్తానంటున్నాడు.. ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంతిమయాత్ర చేయడానికి. గ్రాఫిక్స్ తో కొత్త భవనాన్ని చూపించాడు. అది కోడికత్తి బ్రాండ్. ఒక డిజైన్ చూపించాడు. నేనే ఆశ్చర్యపోయాను. అది సాక్షి ఆఫీసు నుంచి గ్రాఫిక్స్ పంపించారు. కోడికత్తి తప్పితే వారికేం తెలుసు?

సూపర్-6 సూపర్ హిట్ అవుతుంది

  • మొదటిది నిరుద్యోగ యువతీ, యువకులకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తాం. 
  • స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ముగ్గురుంటే రూ.45 వేలు వస్తాయి. 
  • ప్రతి రైతుకు ఆర్థిక సాయం కోసం ఏడాదికి రూ.20 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. 
  • ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. 
  • మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది. 
  • ఇక 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు ఇస్తాం... అని నారా లోకేశ్ వివరించారు. 

More Telugu News