Revanth Reddy: బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయి: రేవంత్ రెడ్డి

  • రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమిపూజ చేసిన సీఎం
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో వివాదం కారణంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందని ఆరోపణ
  • తాము అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించామన్న రేవంత్ రెడ్డి
Revanth Reddy accuses brs for drugs in hyderabad

బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. 11 కిలో మీటర్ల పొడవుతో 6 లైన్లతో రూ.2,232 కోట్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తాను ఎలివేటెడ్ కారిడార్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మరిచిపోయిందని ఆరోపించారు. గత ప్రభుత్వం కేంద్రంతో వివాదం కారణంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.

కానీ తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాధాన్యతను కేంద్రానికి వివరించానని తెలిపారు. మేడ్చల్ అభివృద్ధి చెందాలంటే ఇది పూర్తి కావాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో నగరంలో కూడా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రెండో దశలో 75 కిలో మీటర్ల మెట్రో విస్తరణ చేపట్టబోతున్నామన్నారు.

More Telugu News