YS Jagan: నాలుగో విడత చేయూత నిధులు విడుదల చేసిన సీఎం జగన్

  • అనకాపల్లి జిల్లా పిసినికాడ వద్ద వైఎస్సార్ చేయూత సభ
  • బటన్ నొక్కి రూ.5,060 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం జగన్
  • రూ.18,750 చొప్పున మహిళల ఖాతాల్లో జమ
CM Jagan releases YSR Cheyutha Funds fourth instalment

అనకాపల్లి జిల్లా పిసినికాడ వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ నాలుగో విడత వైఎస్సార్ చేయూత పథకం నిధులు విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.5,060.49 కోట్ల నగదు బదిలీ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల వయసు గల 26,98,931 మంది మహిళల ఖాతాల్లోకి రూ.18,750 చొప్పున జమ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, చేయూత పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.75 వేలు ఇస్తున్నామని చెప్పారు. మహిళా దినోత్సం ముందు రోజున అక్కచెల్లెమ్మలకు ఆర్థికసాయం చేయడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. తమ ఐదేళ్ల పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశామని చెప్పారు. ఇవాళ్టి నుంచి 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతుందని సీఎం జగన్ వివరించారు. 

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్థికసాయం అందిస్తూ అక్కచెల్లెమ్మలను ఆదుకుంటున్నామని, అందుకు తాను గర్విస్తున్నానని తెలిపారు. వైఎస్సార్ చేయూత పథకాన్ని ఏపీ ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ప్రారంభించింది. గత మూడు విడతల్లో ఒక్కొక్క మహిళకు రూ.56,250 మేర లబ్ధి చేకూరింది.

More Telugu News