Gummanuru Jayaram: మంత్రి పదవికి, వైసీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా

  • ఇప్పటిదాకా వైసీపీకి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామా
  • తొలిసారిగా ఓ మంత్రి రాజీనామా
  • నేడు జయహో బీసీ సభలో టీడీపీలో చేరతానని వెల్లడించిన జయరాం
  • గుంతకల్లు బరిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టీకరణ 
Gummanuru Jayaram resigns for YCP

ఏపీ అధికార పక్షం వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా... తొలిసారి ఓ మంత్రి వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. 

మంత్రి గుమ్మనూరు జయరాం నేడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు వివరించారు. ఎమ్మెల్యేగానూ రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇవాళ మంగళగిరిలో జరిగే 'జయహో బీసీ' సభా వేదికపై టీడీపీలో చేరతానని వెల్లడించారు. 

సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలు తమకు నచ్చలేదని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, మందిరంలో శిల్పం లాగా జగన్ తయారయ్యారని పరోక్ష విమర్శలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి ఏం చెబితే జగన్ కు అదే వేదం అని అన్నారు. 

ఈసారి కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ తనను కోరారని, కానీ ఆ ప్రతిపాదన తనకు నచ్చలేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని గుమ్మనూరు జయరాం చెప్పారు.

More Telugu News