Anant Ambani: ఇలాంటి ఆతిథ్యం ఇంకెవరూ ఇవ్వలేరు: ఉపాసన

Upasana hails Ambani family hospitality during Anant Ambani pre wedding celebrtaions

  • అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలు
  • జామ్ నగర్ లో మూడ్రోజుల పాటు మిన్నంటిన కోలాహలం
  • ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు హాజరైన రామ్ చరణ్, ఉపాసన 

భారత వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ముందస్తు పెళ్లి వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో అత్యంత వేడుకగా జరిగాయి. ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు ఈ సంబరాలకు హాజరై, చూపరులకు కనువిందు చేశారు. 

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, స్టార్ హీరో రణవీర్ సింగ్, క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో తదితరులు జామ్ నగర్ కోలాహలంలో పాలుపంచుకున్నారు. 

టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆహ్వానం లభించగా, వారు జామ్ నగర్ వెళ్లి అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు. ఈ వేడుకలు ముగిసిన అనంతరం రామ్ చరణ్, ఉపాసన జోడీ హైదరాబాద్ తిరిగొచ్చింది. దీనిపై ఉపాసన ట్విట్టర్ లో స్పందించారు. 

"అనంత్, రాధిక, యావత్ అంబానీ కుటుంబానికి శుభాభినందనలు. ముఖేశ్ గారూ, నీతా గారూ... మీ ఆతిథ్యం అసమానం. ఇంకెవరూ కూడా ఇంతటి ఘనమైన ఆతిథ్యాన్ని ఇవ్వలేరేమో... మీ అద్భుతమైన ఆదరణకు కృతజ్ఞతలు. అద్భుతమైన వ్యక్తులతో సమయం అద్భుతంగా గడిచిపోయింది" అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News