India vs Pakistan: ఏమిటీ క్రేజ్.. కళ్లుచెదిరే రేటు పలుకుతున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ ధరలు

  • రీసేల్ ప్లాట్ ఫాంలపై టికెట్లకు భారీ డిమాండ్
  • రూ.41 లక్షలు పలుకుతున్న ప్రీమియం టికెట్లు
  • గరిష్ఠంగా రూ.1.86 కోట్లు పలుకుతున్న ఒక టికెట్
India vs Pakistan match ticket prices at sensational rates

దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌‌లకు ఎనలేని ఆదరణ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌ జరిగితే క్రికెట్ అభిమానులు తెగ ఆస్వాదిస్తుంటారు. ఇరుదేశాలకు చెందిన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి కనపరుపరుస్తుంటారు. కొన్నేళ్లుగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోవడంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు అరుదయ్యాయి. అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. దీంతో భారత్, పాకిస్థాన్ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మ్యాచ్ జరిగినా టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా జూన్ 9న న్యూయార్క్‌ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ టికెట్ల విషయంలోనూ ఇదే డిమాండ్ కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు భారీ ధరకు అమ్ముడుపోతున్నాయని తెలుస్తోంది. 

భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ అఫీషియల్ టికెట్లను కొనుగోలు చేసి వాటిని వేరే వారికి భారీ రేటుకు విక్రయిస్తున్నట్టుగా మీడియాలో కతానాలు వస్తున్నాయి. న్యూయార్క్‌లో జరగనున్న మ్యాచ్ టికెట్ అధికారిక ధర 6 డాలర్లుగా ఉంది. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ. 497. అయితే వీఐపీలకు సంబంధించిన ప్రీమియం సీట్ల రేట్లు 400 డాలర్లుగా (రూ. 33,148) ఉన్నాయి. కానీ స్టబ్‌హబ్, సీట్‌గ్రీక్ వంటి రీ-సేల్ ప్లాట్‌ఫామ్స్‌పై టికెట్ రేట్లు భారీగా ఉన్నాయి. 400 డాలర్ల టిక్కెట్లు దాదాపు 40,000 డాలర్లు పలుకుతున్నాయని సమాచారం. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ. 33 లక్షలుగా ఉంది. ఈ రేటుకు ట్యాక్సులను కూడా జోడిస్తే  ధర రూ. 41 లక్షలుగా ఉందని కథనాలు పేర్కొంటున్నాయి.

సీట్‌గీక్‌ వెబ్‌సైట్‌పై ఒక టికెట్‌ను అత్యధికంగా 1,75,000 డాలర్లకు (సుమారు రూ. 1.4 కోట్లు) అమ్మకానికి ఉంచినట్టు యూఎస్‌ఏ టుడే తెలిపింది. అదనంగా ట్యాక్సులను కలిపితే ఈ టికెట్ రేటు రూ. 1.86 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

More Telugu News