AP BJP: అమరావతిలో ముగిసిన బీజేపీ సమావేశాలు... వారం రోజుల్లో పొత్తులపై స్పష్టత

  • గత రెండ్రోజులుగా అమరావతిలో బీజేపీ నేతల సమావేశాలు
  • హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్
  • క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా
  • పొత్తులపై తమ అభిప్రాయాలు శివప్రకాశ్ కు తెలిపిన ఏపీ నేతలు
AP BJP meetings concluded

అమరావతిలో గత రెండ్రోజులుగా జరుగుతున్న ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశాలు ముగిశాయి. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ ఈ సమావేశాలు నిర్వహించారు. 

125 మందికి పైగా నేతలతో శివప్రకాశ్ వరుసగా భేటీ అయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ బలాలపై సమీక్ష నిర్వహించారు. ఏ ఏ నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 

అన్నిటికంటే ముఖ్యంగా, పొత్తులపై ఈ సమావేశాల్లో చర్చించారు. రాష్ట్ర నేతలు పొత్తులపై తమ అభిప్రాయాలను శివప్రకాశ్ కు వివరించారు. పొత్తులపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన నేతలకు చెప్పారు. 

రెండ్రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల వివరాలను శివప్రకాశ్ బీజేపీ అధిష్ఠానానికి నివేదించనున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీలో బీజేపీ పొత్తులపై వారం రోజుల్లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

More Telugu News