Bansuri Swaraj: ఎన్నికల అరంగేట్రం చేస్తున్న సుష్మ స్వరాజ్ కుమార్తె... బీజేపీ జాబితాలో చోటు

  • లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ
  • న్యూఢిల్లీ నియోజకవర్గం టికెట్ ను బాన్సురి స్వరాజ్ కు కేటాయింపు
  • బీజేపీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బాన్సురి 
Sushma Swaraj daughter Bansuri Swaraj makes election debut

బీజేపీ ఇవాళ విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల్లో దివంగత నేత సుష్మ స్వరాజ్ కుమార్తె, సుప్రీంకోర్టు న్యాయవాది బాన్సురి స్వరాజ్ పేరు కూడా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోని ఐదు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను కూడా నేటి జాబితాలో పేర్కొన్నారు. ఇందులో బాన్సురి స్వరాజ్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. బాన్సురి స్వరాజ్ ఎన్నికల బరిలో దిగడం ఇదే తొలిసారి. తనకు టికెట్ కేటాయించిన బీజేపీ అధిష్ఠానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

"నాకెంతో సంతోషంగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు, ప్రతి బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 400 లోక్ సభ స్థానాలు గెలవాలన్న బీజేపీ లక్ష్య సాధన కోసం నా వంతు కృషి చేస్తాను. నరేంద్ర మోదీని దేశ 'ప్రధాన సేవకుడు'గా మూడోసారి కూడా గెలిపించేందుకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పాటుపడతారు" అని బాన్సురి స్వరాజ్ తెలిపారు. 

40 ఏళ్ల బాన్సురి స్వరాజ్ ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. అంతకుముందు, బ్రిటన్ లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ లో పట్టా అందుకున్నారు. గతేడాది ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్ గా నియమితులయ్యారు. బాన్సురి గతంలో హర్యానా రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ గానూ వ్యవహరించారు.

More Telugu News