TSRTC: టీఎస్ఆర్టీసీకి ఐదు జాతీయ అవార్డులు... ఈ నెల 15న అవార్డుల ప్రదానం

  • అవార్డులు ప్రకటించిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్
  • నాలుగు కేటగిరీల్లో ప్రథమ, ఒక కేటగిరీలో ద్వితీయ బహుమతి దక్కించుకున్న టీఎస్ఆర్టీసీ
  • మంత్రి పొన్నం, టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ హర్షం
TSRTC wins 5 national awards for 2022 23

టీఎస్ఆర్టీసిని ఐదు జాతీయస్థాయి అవార్డులు వరించాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ) ప్రతి ఏటా అందించే ఐదు ప్రతిష్టాత్మక నేషనల్ బస్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డులను తెలంగాణ ఆర్టీసీ గెలుచుకుంది.

2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి. రహదారి భద్రతలో ప్రథమ బహుమతి, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్‌ విభాగంలో ప్రథమ, అర్బన్ విభాగంలో ద్వితీయ బహుమతిని టీఎస్ఆర్టీసీ కైవసం చేసుకుంది. సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరిలో ప్రథమ, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు గాను మరో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. ఈ ఐదు అవార్డులను న్యూఢిల్లీలో ఈ నెల 15న టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఏఎస్ఆర్టీయూ ప్రకటించింది.

మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ సజ్జనార్ హర్షం

టీఎస్ఆర్టీసీ 5 జాతీయస్థాయి అవార్డులు గెలుచుకోవడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు దక్కాయన్నారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన ఆర్టీసీ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

నేషనల్ బస్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డులను గెలుచుకోవడంతో ప్రజారవాణా వ్యవస్థలో టీఎస్ఆర్టీసీ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ హర్షం వ్యక్తం చేశారు. సంస్థ అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషికి ఈ అవార్డులు చిహ్నమన్నారు.

More Telugu News