Chandrababu: పవన్ కల్యాణ్ భరించలేక ఒకటే మాటన్నాడు: చంద్రబాబు

  • నెల్లూరులో  టీడీపీ సభ
  • హాజరైన చంద్రబాబు
  • టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం
  • జగన్ ను ఇంటికి పంపాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు
Chandrababu supports Pawan Kalyan comments against CM Jagan

నెల్లూరు రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరికతో టీడీపీకి మరింత బలం చేకూరినట్టయిందని తెలిపారు. న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అని కొనియాడారు. వేమిరెడ్డిని పార్టీలో చేరాలని తానే స్వయంగా వచ్చి ఆహ్వానించానని, అది వేమిరెడ్డి ప్రత్యేకత అని చంద్రబాబు వివరించారు. 

ఇక, సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రశ్నించిన వారిని వేధించడమే జగన్ పని అని వ్యాఖ్యానించారు. ఆనం రామనారాయణరెడ్డిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా ఇలాగే వేధించాడని వెల్లడించారు. అహంభావంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని, రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్న వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

జగన్ పరిస్థితి నచ్చక సొంత పార్టీ వారే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారని వెల్లడించారు. ఐదు కోట్ల ప్రజానీకం క్షేమం కోసం అందరూ ఆలోచించాలని అన్నారు. 

"చెల్లెలు షర్మిలకు అన్యాయం చేశాడు. పాపం, ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వలేదు. ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి. ఇప్పుడామె కూడా ఒక పార్టీలో చేరింది. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలైంది. అందుకే నేనేమీ మాట్లాడను. వాళ్ల అన్నపై ఉండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తోంది. అయినా మేమేమీ బాధపడడంలేదు. సమాధానం చెప్పుకునే సమర్థత తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ విషయం ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి. 

ఇక్కడో విషయం గమనించాలి. ఎన్నికల ముందు సొంత చెల్లెలితో పాదయాత్ర చేయించి, ఊరూరా తిప్పి ఎలా ఉపయోగించుకున్నాడో అందరూ చూశారు. బాత్రూంలో టిష్యూ పేపర్ ను విసిరేసినట్టు చెల్లెల్ని వదిలేశాడు. కుటుంబాల్లో తగాదాలు రావడం సహజమే. కానీ సోషల్ మీడియాలో ఆమె నీపై పోరాడుతోందని ఆమె పుట్టుకపై కూడా నీచంగా మాట్లాడావు. నీ సొంత చెల్లి పుట్టుకను దారుణంగా చిత్రీకరిస్తుంటే నీ కన్నతల్లికి అవమానం కాదా? కనీసం ఆ ప్రచారాన్ని ఖండించారా? 

మమ్మల్ని కూడా ఇలాగే తిడుతుంటారు. పవన్ కల్యాణ్ ను కూడా తిట్టారు. చివరికి పవన్ కల్యాణ్ భరించలేక మొన్న మీటింగ్ లో ఒకటే మాటన్నాడు. అవునయ్యా... నాకు ముగ్గురు పెళ్లాలు ఉన్నారు... నువ్వు నాలుగో  పెళ్లాంగా రమ్మన్నాడు. దాంతో ఏం చేయాలో అర్థంకాక వాళ్లు పీక్కుంటున్నారు... రాజకీయాల్లో కనీస విలువలు ఉండక్కర్లేదా? ఇంత దగాకోరు రాజకీయాలు చూస్తే చాలా బాధేస్తుంది" అని చంద్రబాబు పేర్కొన్నారు.

కనిగిరిలో చెత్త కందుకూరులో బంగారం అవుతుందా?

కందుకూరు సీటులో వైసీపీ అభ్యర్థిని ఇప్పటికి మూడు సార్లు మార్చారు. ఇప్పుడు ఇంకొకాయన (బుర్రా మధుసూదన్ యాదవ్) వచ్చాడు. ఆయన కూడా ఉంటాడో ఉండడో తెలియదు. కనిగిరిలో చెత్త కందుకూరులో బంగారం అవుతుందా? జీడీ నెల్లూరులో కూడా మూడు సార్లు మార్చేశారు. ఆయనైతే ఏకంగా డిప్యూటీ సీఎం... ఆయన సీటుకే దిక్కులేదు. మంగళగిరిలో కూడా మూడు సార్లు మార్చేశారు. ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు... మళ్లీ మార్చే అవకాశం ఉంది. 

వాళ్ల కార్యకర్తలు రోజూ తమ ఫొటోలతో ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. పాపం... సాయంత్రానికి ఆ ఫ్లెక్సీ తీసేసి మరో ఫ్లెక్సీ వేసుకోవాల్సి వస్తోంది. ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా అభ్యర్థులను మార్చేస్తుండడం దేశ రాజకీయాల్లో ఎక్కడైనా చూశారా? 

వై నాట్ 175 అంట... వై నాట్ కుప్పం అంట!

జగన్ అంటున్నాడు... వై నాట్ 175... వై నాట్ కుప్పం అంట! 175 కాదు గుండు సున్నా అని మా చెల్లెమ్మలు చెబుతున్నారు. వై నాట్ పులివెందుల అని మా తమ్ముళ్లు అంటున్నారు. జగన్ ఒక బ్లఫ్ మాస్టర్. మోసం, దగా తప్ప మరేమీ తెలియని వ్యక్తి జగన్. 

జగన్ తానొక్కడినే రాజు అనుకుంటున్నాడు. సిద్ధం మీటింగ్ అంటాడు... ప్రజలు నవ్వుకుంటున్నా లెక్కచేయకుండా ముందుకు పోతుంటాడు. ఆయన మీటింగ్ పెడితే స్కూళ్లన్నింటికీ సెలవులు ఇచ్చేయాల్సిందే. 5 జిల్లాల పరిధిలో ఉండే బస్సులన్నీ ఈయనకే ఇవ్వాలి. మనం మీటింగ్ పెట్టుకుంటే డబ్బులు కట్టినా బస్సులు ఇవ్వరు కానీ, ఈయనకు మాత్రం ఆర్టీసీ వాళ్లు ఊడిగం చేస్తుంటారు... ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. బస్సులు ఎందుకు ఇవ్వలేదో నువ్వు నాకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 40 రోజులే ఉంది... ఆ తర్వాత చెబుతా నీ కథ.

More Telugu News